ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా జీవీఎంసీ సూపర్ ప్లాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 07:52 PM

వీధుల్లో నడిచివెళ్లేటప్పుడూ.. కొన్నిసార్లు గోడలపై గమనించే ఉంటారు.. ఇక్కడ మూత్రం పోసిన వాడు గాడిద. ఇక్కడ చెత్త వేస్తే శిక్షార్హం.. అంటూ కొటేషన్లు, హెచ్చరిక బోర్డులు గమనించే ఉంటారు. ఎవరెన్ని కొటేషన్లు రాసినా.. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా కొంతమంది మాత్రం పద్ధతి మార్చుకోరు. పరిశుభ్రతతో పనిలేదు.. అధికారుల హెచ్చరికలతో అస్సలు అవసరం లేదు.. తమ పంథా తమదే.. తమ పని తమదే. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. చెత్త వేసేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇంటింటికీ చెత్త సేకరణ జరుపుతున్నా.. చెత్త కుండీలు ఏర్పాటు చేసినా కూడా ఇలాంటి వారిలో మార్పులు ఆశించడం అత్యాశే అవుతోంది. కాలనీలలోని ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు, చెత్తను పారబోస్తూ అపరిశుభ్ర వాతావరణానికి కారణమవుతున్నారు. అలాంటి చోట్ల అధికారులు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఇలాంటి వారిలో ఎలాంటి మార్పూ లేదు.


దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఓ సరికొత్త ఆలోచన చేసింది. స్థానికుల సహకారంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎక్కడైతే వ్యర్థాలను పారేస్తున్నారో అలాంటి ప్రదేశాలను గుర్తించి.. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తున్నారు. ఆ తర్వాత దేవుడి ఫోటోలు పెట్టి.. ముగ్గులు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల కుండీలలో మొక్కలు ఉంచుతున్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ఈ పద్ధతి అనుసరించగా సత్ఫలితాలు వచ్చాయి. అందుకే విశాఖపట్నం నగరం మొత్తం ఈ విధానం అనుసరించాలని జీవీఎంసీ ఆలోచనలు చేస్తోంది. దేవుడి ఫోటోలు పెట్టడం, ముగ్గులు పెట్టటంతో చెత్త వేసేవారిలో మార్పు వస్తోంది. తమ చర్యలను విరమించుకుంటున్నారు. దీంతో విశాఖపట్నం మొత్తం ఈ కార్యక్రమం అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


మరోవైపు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డులో ఉన్న ఎంవీపీ కాలనీ సెక్టార్–9లో ఇటీవల జీవీఎంసీ ఈ కార్యక్రమం నిర్వహించింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పరిసరాలను నిర్వహించడంపై స్థానికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్పొరేటర్ గోలగాని మంగవేణి ప్రజలు తమ పరిసరాలను చెత్త లేకుండా ఉంచుకోవాలని కోరారు.


చెత్త వేసే ప్రాంతంలో శుభ్రం చేసి ముగ్గులు వేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారేసే వారిపై కఠినమైన జరిమానాలు విధిస్తామని జీవీఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అలా కాదని నిబంధనలు అతిక్రమించి చెత్త వేస్తే వేయి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa