రాజ్ మంతెన.. ఈ పేరు గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. రాజ్ రామలింగ మంతెన, రామరాజు మంతెన.. ఇలా గత రెండు మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ఈ పేరు మీద చర్చ జరుగుతోంది. మనదేశంలోఅత్యంత ఖరీదైన పెళ్లిళ్లుజరగటం కొత్తేమీ కాదు. ఈ ఏడాది ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతముకేష్ అంబానీ తనయుడి వివాహంఇలాగే అంగరంగ వైభవంగా.. అంతర్జాతీయ ప్రముఖుల నడుమ అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు రాజ్ మంతెన కుమార్తె వివాహం అలాగే హాట్ టాపిక్గా మారింది. తెలుగు వ్యక్తి, ఎన్ఆర్ఐ అయిన రామరాజు మంతెన కుమార్తెనేత్ర మంతెన వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అట్టహాసంగా జరిగింది. నేత్ర మంతెన , వంశీ గాదిరాజుల వివాహ వేడుక మూడు రోజుల పాటు జరగ్గా.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వివాహానికి హాజరైన వీవీఐపీల లిస్టుతో.. రాజ్ మంతెన ఎవరనే దానిపై ఆసక్తి మొదలైంది.
రాజ్ మంతెన.. నిన్నటి వరకూ పబ్లిక్ లైఫ్కి, మీడియాకు దూరంగా ఉంటున్న తెలుగు మూలాలున్న ఓ ఫార్మా బిలియనీర్. అయితే కూతురి పెళ్లి జరిపించి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు. రాజ్ మంతెన.. అమెరికన్ ఫార్మారంగంలో చిరపరిచితులైన పేరు. ఇంజీనస్ ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్, సీఈవో. ఈ సంస్థ అమెరికాతో పాటుగా స్విట్జర్లాండ్, భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. విజయవాడకు చెందిన రాజ్ మంతెన.. జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. అనంతరం 1980లో అమెరికాకు వెళ్లారు.
అక్కడ మేరిల్యాండ్ యూనివర్సిటీలో క్లినికల్ ఫార్మసీ చదువుకున్నారు. ఫ్లోరిడాలోని పీ4 హెల్త్ కేర్ సీఈవోగా రాజ్ మంతెన తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఐకోర్ హెల్త్ కేర్, ఇంటర్నేషనల్ ఆంకాలజీ నెట్వర్క్, ఆంకో స్ర్కిప్ట్స్ స్థాపించారు. రాజ్ మంతెన స్థాపించిన కంపెనీలలో ఐకోర్ హెల్త్ కేర్ సూపర్ హిట్ అయ్యింది. ఈ కంపెనీని ఆయన 200 మిలియన్ డాలర్లకు అమ్మేయటంతో ఆయన స్థాయి మారిపోయింది. ఆ తర్వాత యూఎస్ ఫార్మా రంగంలో కీలక వ్యక్తిగా ఎదిగారు.
దీంతో రాజ్ మంతెన కుమార్తె నేత్ర మంతెన వివాహానికి రాజకీయ, క్రీడా, వ్యాపార, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీంతో నవంబర్ 21, 22వ తేదీలలో జరిగిన ఈ పెళ్లి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ పెళ్లి కోసం సిటీ ప్యాలెస్, ది లీలా ప్యాలెస్ వంటి రాజభవనాలను బుక్ చేసుకున్నారు. జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్ వంటి గ్లోబల్ స్టార్లతో ఆటాపాటా నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా హాజరవ్వడం విశేషం.
బాలీవుడ్ సెలబ్రిటీలు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, జాన్వీ కపూర్ రణ్వీర్ సింగ్,కరణ్ జోహార్, కృతి సనన్ వంటి స్టార్లు కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. ఇక పెళ్లి కొడుకు విషయానికి వస్తే.. వంశీ గాదిరాజు, ప్రముఖ టెక్ ఇన్నోవేటర్, కొలంబియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పట్టా పొందారు, సూపర్ ఆర్డర్ అనే ఫుడ్ యాప్ సహ వ్యవస్థాపకుడు కూడా.
మరోవైపు వ్యాపారవేత్త మాత్రమే కాదు.. రాజ్ మంతెన శ్రీవారి భక్తుడు కూడా. ఎనిమిదేళ్ల కిందట 2017సో తిరుమల శ్రీవారికి ఏకంగా 28 కిలోల బంగారంతో చేయించిన సహస్ర నామ కాసుల హారాన్ని విరాళంగా అందించడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఈ హారం కోసం 1008 బంగారు నాణెలు ఉపయోగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa