విజయవాడ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంటోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. అత్యాధునిక వసతులతో ఎయిర్పోర్టు తరహాలో విజయవాడ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నప్పటికీ.. విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ సంఖ్యలో మాత్రం మార్పు లేదు. ప్రస్తుతం విజయవాడ రైల్వేస్టేషన్లో పది ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అయితే పెరుగుతున్న అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు కొత్త ప్లాట్ఫామ్లు నిర్మించాలని.. ప్లాట్ఫామ్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచాలని తొలుత రీడెవలప్మెంట్ ప్రణాళికలో పేర్కొన్నారు. అయితే తాజాగా విజయవాడ రైల్వేస్టేషన్లో కొత్త ప్లాట్ ఫామ్లు వద్దని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
అమరావతి రాజధాని ప్రాంతం కోసం రూపొందించిన సమగ్ర రైలు అభివృద్ధి ప్రణాళిక కారణంగా విజయవాడ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారమ్ల సంఖ్యను పెంచకూడదని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ సమీపంలో ఉన్న రాయనపాడు, గుణదల రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో శాటిలైట్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల జరిగిన ఓ సమావేశంలోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే అమరావతి రైల్వే స్టేషన్లో మెగా టెర్మినల్ నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న గన్నవరం రైల్వే స్టేషన్ను మరొక టెర్మినల్గా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వేస్టేషన్లో కొత్త ప్లాట్ఫారమ్ల నిర్మాణం అవసరం లేదని నిర్ణయించినట్లు విజయవాడ డీఆర్ఎం కార్యాలయం తెలిపింది. రాజధాని ప్రాంతంలోని ప్రధాన రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుంటే, విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని., ట్రాఫిక్ను శాటిలైట్ రైల్వే స్టేషన్లకు, ప్రతిపాదిత రైల్వే టెర్మినల్లకు మళ్లించడం వలన కొత్త ప్లాట్ఫామ్ నిర్మించాల్సిన అవసరం ఉండదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు విజయవాడ రైల్వేస్టేషన్ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు, తూర్పు, పశ్చిమ వైపు కొత్తగా అత్యాధునిక భవనాలు నిర్మించనున్నారు. అలాగే స్టేషన్లోని పది ప్లాట్ ఫారాలను 40,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కవర్ ఓవర్ ప్లాట్ఫారమ్లుగా పునరుద్ధరించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్కు తూర్పు, పశ్చిమ వైపు 144 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. వీటితో పాటు మరో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa