పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు, రవాణా శాఖ జరిమానాలపై కర్ణాటక ప్రభుత్వం 50 శాతం రాయితీని ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్ నవంబర్ 21వ తేదీన ప్రారంభం కాగా.. డిసెంబర్ 12వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1991-1992 నుంచి.. 2019-2020 మధ్య ఆర్టీఓ నమోదు చేసిన కేసులు, ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన అన్ని పాత ఈ-చలాన్లకు ఇది వర్తిస్తుందని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేవలం జరిమానాలపైనే తగ్గింపు ఉంటుందని స్పష్టం చేశాయి. అయితే వాహన పన్ను బకాయిలు మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందేనని తెలిపాయి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, బెంగళూరు వన్ సెంటర్లు లేదా ఆన్లైన్ యాప్స్ ద్వారా ఈ-చలాన్లు కట్టవచ్చని.. ఆర్టీఓ కేసుల కోసం సంబంధిత ఆఫీసులకు వెళ్లాలని సూచించింది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా జరిమానాలు పడి.. వాటిని చెల్లించలేక సతమతమవుతున్న వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న జరిమానాల క్లియరెన్స్ కోసం మరోసారి 50 శాతం రాయితీ పథకాన్ని ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక రవాణా శాఖ ఇటీవలె అధికారిక ప్రకటన విడుదల చేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం రెండు రకాల పెండింగ్ కేసులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన చలాన్లతోపాటు.. ఆర్టీఓ కేసులకు కూడా ఈ 50 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపింది.
అయితే 1991-1992 నుంచి 2019-2020 మధ్య కర్ణాటక రవాణా శాఖ అధికారులు.. నమోదు చేసిన శాఖాపరమైన కేసులకు ఈ 50 శాతం తగ్గింపు వర్తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన అన్ని పాత ఈ-చలాన్లకు కూడా ఈ సగం రాయితీ లభిస్తుందని పేర్కొన్నాయి. అయితే ఆ చలాన్లు ఏ సంవత్సరంలో జారీ చేశారు అనే దానితో సంబంధం లేకుండానే రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.
హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, నో పార్కింగ్, సిగ్నల్ జంప్ వంటి సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు చెల్లించవచ్చని కర్ణాటక సర్కార్ తెలిపింది. ముఖ్యంగా రవాణా వాహనాలకు సంబంధించిన పర్మిట్ ఉల్లంఘనలు, ఓవర్ లోడింగ్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోవడం, సీటింగ్ కెపాసిటీ మార్చడం వంటి కేసుల్లో జరిమానాలు సాధారణంగా రూ.1,000 నుంచి రూ. 10,000 వరకు ఉంటాయి.
గతంలో ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య కూడా కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. అప్పుడు 21 రోజుల పాటు ఇలాంటి ఆఫర్ ఇచ్చినప్పుడు బెంగళూరు పోలీసులు ఏకంగా రూ. 106 కోట్ల బకాయిలను వసూలు చేశారు. ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఆర్టీఓ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ తాజా విడత ద్వారా రవాణా శాఖ సుమారు రూ. 25 నుంచి రూ.30 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్ నవంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa