దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ముంబై ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తాము రచిస్తున్న భారీ ప్రణాళికను వివరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముంబై అడుగున తాము ఒక పాతాళ లోకాన్ని సృష్టిస్తున్నామని పేర్కొన్నారు. ప్రముఖ వెబ్ సిరీస్ పేరును ఉపయోగించి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రాఫిక్ కష్టాలకు అండర్ గ్రౌండ్ పరిష్కారం
సోమవారం మీడియాతో మాట్లాడిన దేవేంద్ర ఫడ్నవీస్.. ముంబైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి భూమి పైన ఉన్న రోడ్లకు సమాంతరంగా.. భూమి లోపల భారీ సొరంగ మార్గాలను నిర్మించి.. నెట్వర్క్ విస్తరించనున్నట్లు తెలిపారు. ముంబై అంతటా సొరంగాల విస్తృతమైన నెట్వర్క్ను సృష్టిస్తున్నామని.. ఇది ఒక రకంగా పాతాళ లోకం లాంటిదని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ముంబైలో ట్రాఫిక్ రద్దీని పూర్తిగా తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టన్నెల్ నెట్వర్క్కు మెట్రో కారిడార్లు అనుబంధంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
ముంబైలో కీలక ప్రాజెక్టులు
బోరివలి - గోరేగావ్: ప్రస్తుతం ఉన్న రోడ్లకు సమాంతరంగా బోరివలి - గోరేగావ్ మార్గంలో కొత్త రహదారి.
వర్లీ - శివడి కనెక్టర్: వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా అటల్ సేతు నుంచి బాంద్రా-వర్లీ సీ లింక్ వరకు నాన్స్టాప్ ప్రయాణం. బాంద్రా - బీకేసీ టన్నెల్: బాంద్రా నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) వరకు ప్రతిపాదించిన సొరంగం ద్వారా ఎయిర్పోర్ట్ ప్రయాణం సులభం కానుంది.
త్వరలో జరగనున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయ వ్యూహాలపైనా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని నడపడానికి రెండు మార్గాలు ఉన్నాయని.. అందులో ఒకటి సిద్ధాంతమని.. రెండోది సంఖ్యాబలం అని పేర్కొన్నారు. సంఖ్యాబలం లేకుండా సిద్ధాంతాన్ని ప్రచారం చేయలేమమని.. రాజకీయాల్లో ప్రాక్టికల్గా ఉండాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఘోర వైఫల్యాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ సిద్ధాంతం గురించి మాట్లాడారని.. కానీ ఆయనకు సీట్లు రాలేదని దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తు చేశారు.
రాజకీయాలపై గౌరవం
రాజకీయ వ్యవస్థ మొత్తం అవినీతిమయం అయిందని ముద్ర వేయడాన్ని తాను అంగీకరించనని సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని.. కానీ రాష్ట్ర స్థాయిల్లో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని అంగీకరించారు. అంత మాత్రాన వ్యవస్థ మొత్తం చెడ్డది అని కాదని పేర్కొన్నారు. వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ఉమ్మడి ప్రణాళిక ద్వారా ప్రభుత్వాన్ని నడపవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa