అరుణాచల్ ప్రదేశ్లో జన్మించిన భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ నివాసికి చైనాలోని షాంఘై విమానాశ్రయంలో తీవ్ర అవమానం ఎదురైంది. కేవలం తన పాస్పోర్ట్లో పుట్టిన స్థలం అరుణాచల్ ప్రదేశ్ అని ఉండడంతో.. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను గంటల తరబడి నిర్బంధించి, వేధించారు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ చైనాలో ఓ భాగం అని.. ఆ దేశ పాస్పోర్ట్ తీసుకోవాలంటూ ఆమెను ఒత్తిడికి గురి చేశారు. దాదాపు 18 గంటల పాటు నిర్బంధించి ఆమెకు చుక్కలు చూపించారు. ఎలాగోలా బయటపడ్డ ఆమె దీని గురించి వివరిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
పాస్పోర్ట్ చెల్లదని తిరస్కరణ
పీమా వాంగ్జోమ్ తొంగ్దోక్ అనే మహిళ భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో జన్మించింది. కానీ ప్రస్తుతం ఈమె బ్రిటన్లో ఉంటూ.. అక్కడే పౌరసత్వం తీసుకుంది. అయితే పీమా వాంగ్జోమ్ తొంగ్దోక్.. నవంబర్ 21వ తేదీన లండన్ నుంచి జపాన్కు బయలుదేరింది. ఈక్రమంలోనే షాంఘై పుడాంగ్ ఎయిర్పోర్ట్లో మూడు గంటల పాటు విమానాన్ని నిలిపి ఉంచగా.. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె పాస్పోర్ట్ చూసిన అధికారిణి ఒక్కసారిగా కేకలు వేస్తూ.. ఇండియా, ఇండియా అని అరిచింది. వెంటనే ఆమెను పక్కకు తీసుకెళ్లి.. తన పాస్పోర్ట్ చెల్లదని చెప్పింది.
అయితే ఎందుకు చెల్లదంటూ పీమా ప్రశ్నించగా.. ఆ అధికారిణి "అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో భాగం. కాబట్టి మీ పాస్పోర్ట్ చెల్లదు" అని స్పష్టం చేసినట్లు పీమా తెలిపారు. గతంలో షాంఘై మీదుగా ప్రయాణించినా.. లండన్లోని చైనా రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఎలాంటి సమస్యలు లేవని పీమా తెలిపారు. ఈసారి మాత్రమే తనకు ఇలాంటి అనుభవం ఎదురైందని అన్నారు. అలాగే మూడు గంటలు వేచి ఉండాల్సి ఉండగా.. సుమారు 18 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా పలువురు ఇమ్మిగ్రేషన్ సిబ్బంది, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ సిబ్బంది ఆమెను చూసి నవ్వారని, గేలి చేశారని, చైనా పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకోమని సూచించారని ఆమె వాపోయారు. ఈ సమయంలో తనకు ఎవరూ సరైన సమాచారం ఇవ్వలేదని, కనీసం ఆహారం, ఇతర సౌకర్యాలు కూడా కల్పించలేదని వెల్లడించారు.
అంతేకాకుండా ఆమె పాస్పోర్ట్ను తీసుకున్న అధికారులు దాన్ని ఆమెకు తిరిగివ్వలేదు. ఆమె జపాన్కు వెళ్లాల్సి విమానాన్ని ఎక్కకుండా అడ్డుకున్నారు. అయితే చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ నుంచి కొత్త టిక్కెట్ను కొనుగోలు చేస్తేనే.. పాస్పోర్ట్ తిరిగి ఇస్తామని అధికారులు చెప్పినట్లు పీమా వివరించారు. అయితే అందుకు ఏమాత్రం ఒప్పుకోని పీమా.. యూకేలోని తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారత కాన్సులేట్ను సంప్రదించారు. వెంటనే భారతీయ అధికారులు రంగంలోకి దిగి.. ఆమెను రాత్రి ఆలస్యంగా చైనా నగరం నుంచి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.
అరుణాచల్ ప్రదేశ్ చైనాలో ఉందని చెప్పడం, తనను చైనాకు చెందిన దానివంటూ అక్కడి అధికారులు గేలి చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన తనకు జరిగిన అవమానం గురించి వివరిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి, అరుణాచల్ పౌరులకు జరిగిన ప్రత్యక్ష అవమానంగా అభివర్ణించారు. ఈ ఘటనపై విచారణ జరిపి, ఇమ్మిగ్రేషన్, ఎయిర్లైన్ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని.. తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారతీయులకు ఇలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా హామీ ఇవ్వాలని కూడా ఆమె కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa