గువహటిలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ల వైఫల్యంపై వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ విమర్శలు గుప్పించాడు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంపై విమర్శనాస్త్రాలు సంధించాడు. తాను తుది జట్టులో ఉండి ఉంటే.. కథ వేరేలా ఉండేదంటూ.. పరోక్షంగా చెప్పాడు. ఈ మ్యాచ్ ప్రస్తావన తేకుండానే.. తన మనసులోని మాటను అందరికీ అర్థమయ్యేలా ఒక్క పోస్ట్తో చెప్పేశాడు.
గువహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టలో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 489 పరుగులు చేసింది. అనంతరం భారత్.. 201 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్(0), రిషభ్ పంత్ (7), నితీశ్ కుమార్ రెడ్డి (10), రవీంద్ర జడేజా (6) దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ తీరుపై కరుణ్ విమర్శలు గుప్పించాడు.
“కొన్ని పరిస్థితులు మనసుకు బాగా తెలిసిన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మైదానంలో మనం లేకపోతే మరింత బాధ కలుగుతుంది” అని కరుణ్ నాయర్ ట్వీట్ చేశాడు. ఈ పోస్టును ఇప్పటికే ఏకంగా 15 లక్షల మంది వీక్షించారు.
ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కరుణ్ నాయర్ త్రిబుల్ సెంచరీని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలోనే అతడు త్రిబుల్ సెంచరీ చేసి.. జట్టును గెలిపించాడు. ఇప్పుడు అతడు ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదని పేర్కొంటున్నారు.
కాగా కరుణ్ నాయర్ ఇటీవల దేశవాళీ క్రికెట్లో అదరగొట్టాడు. దీంతో 8 ఏళ్లు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగు మ్యాచ్ల్లో ఆడిన కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 33 ఏళ్ల కరుణ్ నాయర్ ఇంగ్లాండ్తో 4 టెస్టుల్లో 25.62 సగటుతో 205 రన్స్ మాత్రమే స్కోరు చేశాడు. దీంతో అతడిని టెస్ట్ జట్టు నుంచి తప్పించారు సెలక్టర్లు. అయితే తనను టెస్ట్ జట్టు నుంచి తప్పించడంపై కరుణ్ నాయర్ విమర్శలు గుప్పించాడు. తాను మరో అవకాశం పొందేందుకు అర్హుడిని అని పేర్కొన్నాడు. కానీ వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్తో పాటు సౌతాఫ్రికాతో సిరీస్కు సైతం అతడిని ఎంపిక చేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa