మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేతగా నిలిచి భారత్ జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా రెండుసార్లు ఛాంపియన్గా అవతరించింది. సోమవారం బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనీస్ తైపీ జట్టును మట్టికరిపించి టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ – చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో చిత్తు చేసింది. దీంతో వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచకప్ టైటిల్ సాధించి.. భారత మహిళల జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది.
ఈ టోర్నమెంట్ బంగ్లాదేశ్ వేదికగా జరిగింది. లీగ్ స్టేజ్లో ఓటమి అనేది లేకుండా భారత మహిళల జట్టు సెమీ ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో ఇరాన్ను 33–21 పాయింట్ల తేడాతో చిత్తు చేసింది. మరోవైపు చైనీస్ తైపీ కూడా ఓటమి అనేది లేకుండా నాకౌట్కు చేరుకుంది. ఆ జట్టు సెమీస్లో 25–18 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్పై గెలుపొంది.. ఫైనల్కు చేరుకుంది. భారత్, చైనీస్ తైపీ జట్లు అజేయంగా తుది పోరుకు అర్హత సాధించాయి.
మొత్తంగా ఈ టోర్నీలో 11 జట్లు పాల్గొన్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలుపొందింది. అటు.. గ్రూప్ ‘బి’లో చైనీస్ తైపీ ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్ సైతం హోరాహోరీగా సాగింది. టోర్నీ ఆసాంతం జోరు కొనసాగించిన భారత్.. ఫైనల్లోనూ అదే ప్రదర్శన చేసింది. ప్రారంభం నుంచి చివరి వరకు ఏమాత్రం అలసత్వానికి పోలేదు. ఎటాకింగ్ గేమ్తో చైనీస్ తైపీ జట్టును మట్టికరిపించింది.
ఈ టోర్నీలో భారత జట్టు విజయంలో కెప్టెన్ రీతు నేగి, వైస్ కెప్టెన్ పుష్ప రాణా కీలక పాత్ర పోషించారు. రీతు రైడింగ్లో సత్తాచాటగా, పుష్ప రాణా డిఫెన్స్లో అదరగొట్టింది. దీంతో భారత్.. ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చలాయించింది. వారితో పాటు చంపా ఠాకూర్, భావనా ఠాకూర్, సాక్షి శర్మ కూడా మంచి ప్రదర్శన చేశారు. జట్టు హెడ్ కోచ్ తేజస్వి, అసిస్టెంట్ కోచ్ ప్రియాంకలు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతూ అద్భుత ప్రదర్శన రాబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa