పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం వల్ల వందలాది మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులు భయపడుతూ తమ స్వస్థలాలకు తిరిగి పయనమవుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు గుర్తింపు పత్రాలను ధృవీకరించే ఎన్యుమరేటర్ల బృందాలు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తుండటంతో, చట్టవ్యతిరేకంగా ఇక్కడ స్థిరపడిన వారిలో ఆందోళన నెలకొంది. ఈ పరిశోధనలో తమ గుర్తింపు బయటపడితే జైలు శిక్ష లేదా దేశం నుంచి బహిష్కరణ తప్పదనే భయంతో చాలామంది ఇప్పటికే సరిహద్దు దాటేస్తున్నారు.
నవంబర్ నెల ప్రారంభం నుంచి ఈ తరలివెళ్లే ధోరణి మరింత వేగం పుంజుకుంది. ఉత్తర 24 పరగణా, దక్షిణ 24 పరగణా, నాదియా, ముర్షిదాబాద్ వంటి బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో రాత్రి రాత్రి బస్సులు, వ్యాన్లు, ఆటోల్లో బయలుదేరుతున్న గుంపులు కనిపిస్తున్నాయి. ఎన్యుమరేటర్లు ఇంటికొచ్చి ఆధార్, పాన్ కార్డు, జనన ధృవీకరణ పత్రం లాంటి పత్రాలు అడిగినప్పుడు చాలామంది “మేం పని కోసం వచ్చాం, ఏ డాక్యుమెంట్ లేవు” అని ఒప్పుకుంటున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు ఈ ప్రక్రియలో గుర్తించబడిన వేలాది మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయి. గతంలో రాజకీయ పార్టీల అండతో ఓటరు కార్డులు, ఆధార్ కార్డులు సృష్టించుకున్న వారు ఇప్పుడు ఎటువంటి రక్షణ లేకుండా పోయారు. ఫలితంగా, గుర్తింపు బయటపడకముందే దేశం విడిచి వెళ్లడమే ఏకైక మార్గంగా మిగిలింది.
ఈ అక్రమ వలసల సమస్యను ఎన్నికల సంఘం గట్టిగా అడ్డుకుంటుండటంతో, బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాల్లో ఒక్కసారిగా జనసంచారం తగ్గిపోతోంది. రాష్ట్రంలో జనాభా గణాంకాలు, ఓటరు శాతం, భద్రతా పరిస్థితులపై ఈ మార్పు దీర్ఘకాలిక ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa