విమాన భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పైలట్లు, క్యాబిన్ సిబ్బందితో పాటు విమాన షెడ్యూళ్లను ప్లాన్ చేసే సిబ్బందికి కూడా ఏటా ఫాటిగ్ మేనేజ్మెంట్పై శిక్షణను తప్పనిసరి చేసింది. ఇటీవల కాలంలో విమాన సిబ్బంది పని గంటలు పెరగడం, వారి అలసట భద్రతపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రతీ విమానయాన సంస్థ తమ రెగ్యులర్ గ్రౌండ్ ట్రైనింగ్లో భాగంగా ఏటా కనీసం ఒక గంట ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఇందులో విమాన ప్రయాణ గంటలు, డ్యూటీ పరిమితులు, తప్పనిసరి విశ్రాంతి నియమాలతో పాటు, నిద్రకు సంబంధించిన శాస్త్రీయ అంశాలు, శరీర గడియారాన్ని ప్రభావితం చేసే అంశాలు, అలసట పనితీరుపై ఎలా ప్రభావం చూపుతుందనే విషయాలపై అవగాహన కల్పిస్తారు.సిబ్బంది తమ అలసట గురించి ఫిర్యాదు చేసేందుకు పారదర్శకమైన వ్యవస్థను, వాటిని సమీక్షించి దిద్దుబాటు చర్యలు సూచించేందుకు ఒక స్వతంత్ర ఫాటిగ్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా డీజీసీఏ ఎయిర్లైన్స్ను ఆదేశించింది. ఎంతమంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు, ఎన్ని అలసట ఫిర్యాదులు వచ్చాయి, వాటిలో ఎన్నింటిని స్వీకరించారు, ఎందుకు తిరస్కరించారు అనే వివరాలతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి తమకు నివేదిక పంపాలని స్పష్టం చేసింది.గత జులైలో జరిపిన ఆడిట్లో కొన్ని విమానయాన సంస్థలు అలసటకు సంబంధించిన నిబంధనలను సరిగ్గా పాటించడం లేదని డీజీసీఏ గుర్తించింది. పైలట్ సంఘాలు కూడా రాత్రిపూట ల్యాండింగ్లు పెంచడం భద్రతకు ముప్పు అని హెచ్చరించాయి. గతంలో వారపు విశ్రాంతిని 48 గంటలకు పెంచుతూ డీజీసీఏ తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని సంస్థలు వ్యతిరేకించినా, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో అవి అమలయ్యాయి. ఈ నేపథ్యంలో, సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అలసట వల్ల తలెత్తే ముప్పును ముందుగానే నివారించే లక్ష్యంతో డీజీసీఏ ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa