ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ప్రిన్సిపల్ సార్ నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, తట్టుకోలేకపోతున్నా'

Crime |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 09:02 PM

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థిని ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె చనిపోయే ముందు రాసిన లేఖలో.. స్కూల్ ప్రిన్సిపాల్ తనను లైంగికంగా వేధించడంతో పాటు శారీరకంగా హింసించాడని ఆరోపించడం కలకలం రేపింది. విద్యార్థిని ఆత్మహత్య వార్త తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.


జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షాహి మోహన్ సింగ్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను లేఖలో వివరంగా పేర్కొందని ధృవీకరించారు. ప్రిన్సిపాల్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, శరీర భాగాలను తాకుతూ ఆమెను ఇబ్బంది పెట్టారని వివరించారు. లైంగిక వేధింపులతో పాటు శారీరకంగా కూడా ఆమెను హింసించినట్లు వివరించిందన్నారు. ఈ కారణాల వల్లే తాను తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ లేఖలో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.


అయితే ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్న వెంటనే ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశామని ఎస్‌ఎస్‌పీ సింగ్ తెలిపారు. విద్యార్థిని ఆరోపించిన లైంగిక వేధింపులపై.. నిందితుడిని ప్రశ్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ గదిని సీజ్ చేశారు. పోస్ట్‌మార్టం తర్వాత బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


అక్రమంగా నడుస్తున్న హాస్టల్


ఈ ఘటనతో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న తీవ్రమైన అక్రమాలు కూడా బయటపడ్డాయి. రూరల్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో.. మృతి చెందిన విద్యార్థిని పాఠశాల ప్రాంగణంలోనే అక్రమంగా నడుస్తున్న హాస్టల్‌లో ఉంటున్నట్లు తేలింది. ఈ హాస్టల్‌లో మొత్తం 33 మంది విద్యార్థులు (22 మంది బాలురు, 11 మంది బాలికలు) ఉంటున్నారు.


ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం జష్‌పూర్ కలెక్టర్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బగీచా ప్రాంత సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రదీప్ రథియా మాట్లాడుతూ.. సంఘటనపై పూర్తి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. మానసిక, శారీరక వేధింపుల ఆరోపణలతో సహా కేసులోని అన్ని అంశాలను విచారించి, తమ నివేదికను ఏడు రోజుల్లోగా సమర్పించాలని దర్యాప్తు బృందాన్ని ఆదేశించారు. మరోవైపు తమ బిడ్డ చావుకు కారణం అయిన ప్రిన్సిపాల్‌ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa