ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జంఝావతి డ్యామ్‍‌లో పడి ముగ్గురు గల్లంతు,,,,విహారయాత్రలో విషాదం

Crime |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 09:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం రోజున జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు గల్లంతయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతి రబ్బర్ డ్యామ్‌లో పడి ముగ్గురు గల్లంతయ్యారు. కొమరాడ మండలంలోని జంఝావతి రబ్బరు డ్యామ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. శివిని గ్రామానికి చెందిన శరత్‌, గోవింద్‌, ప్రదీప్‌ అనే ముగ్గురు యువకులు తమ బంధువులతో కలిసి రబ్బర్‌ డ్యామ్‌ వద్దకు పిక్నిక్ కోసమని వెళ్లారు. ఈ క్రమంలోనే జంఝావతి రబ్బర్ డ్యాంలో ఈతకొట్టేందుకు దిగారు. అయితే ప్రమాదవశాత్తూ డ్యామ్‌లో మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంతో విహారయాత్ర కాస్తా విషాదమయంగా మారింది.


అయితే డ్యామ్‌లో పడిన ఓ బాలుడిని రక్షించే క్రమంలో వీరు గల్లంతయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ ప్రమాదం జరిగింది. ముగ్గురు గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం లభించింది. అనంతగిరి మండలం జీనబాడు వద్ద ఉన్న రైవాడ రిజర్వాయర్‌ వద్ద ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు.


మరోవైపు విశాఖపట్నంలో ఓ హోంగార్డు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే ఓ హోం గార్డు రైలుపట్టాలపై అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. విశాఖపట్నం జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రోజున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..జీవీఎంసీలోని 57వ వార్డు అశవానిపాలెనికి చెందిన బి. కృష్ణారావు అనే వ్యక్తి విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో డిప్యూటేషన్‌ మీద హోంగార్డుగా పనిచేస్తున్నారు.


అయితే ఆదివారం రోజున ఇంట్లో వారికి కూరగాయలు తెస్తానని చెప్పిన కృష్ణారావు. రైలుపట్టాలపై చనిపోయి కనిపించారు. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వేపోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa