ఏపీలోని గ్రామ సచివాలయ ఉద్యోగులకు త్వరలోనే తీపికబురు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామ సచివాలయాల నిర్మాణం, ఉద్యోగుల పదోన్నతులపై అధ్యయనం జరిపి.. మార్చి నాటికి నివేదిక రూపొందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది పదోన్నతులపై మంత్రుల బృందం, వివిధ శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రామ సచివాలయాల పనితీరు, సచివాలయ వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని సూచించారు. అలాగే గ్రామ స్థాయిలో వివిధ శాఖల నిర్మాణం ఎలా ఉందనే అంశాలతో పాటుగా గ్రామ సచివాలయం ఉద్యోగులను ఆయా శాఖలతో ఎలా అనుసంధానించాలనే అంశం గురించి ఆలోచించాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో.. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశం సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి ప్రమోషన్లు, ఇతర శాఖల్లో వారిని అనుసంధానించేందుకు ఉన్న అవకాశాలపై మంత్రుల బృందం, ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించిన తర్వాత.. సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి.. ఈ మొత్తం ప్రక్రియను పూర్తిగా అధ్యయనం చేసి మార్చి నాటికి నివేదిక సమర్పించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవసరమైతే.. ప్రతి నెలా ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహిద్దామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, హోం శాఖ , వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, హెచ్ఓడీలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa