ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ రూట్లో కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 09:27 PM

ఆంధ్రప్రదేశ్‌‌లోని రైలు ప్రయాణికులకు శుభవార్త. రాష్ట్రానికి త్వరలోనే మరో వందే భారత్ రైలు రానుంది. ఎన్నో రోజులుగా రైలు ప్రయాణికులు ఎదురుచూస్తున్న విజయవాడ – బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ వచ్చే నెలలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం. డిసెంబర్ 10వ తేదీన విజయవాడ బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమవుతుందని సమాచారం. విజయవాడ బెంగళూరు మార్గంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపేందుకు మే నెలలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూట్‌ మ్యాప్, షెడ్యూల్‌‌ను కూడా రైల్వేశాఖ ఇటీవల ఖరారు చేసింది. నవంబర్ నెలాఖరు నుంచే ప్రారంభిస్తారని తొలుత వార్తలు రాగా.. ఇప్పుడు డిసెంబర్ పదో తేదీ నుంచి పట్టాలెక్కించనున్నట్లు సమాచారం.


మరోవైపు విజయవాడ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. మంగళవారం తప్ప వారంలో మిగతా ఆరూ రోజులూ అందుబాటులో ఉండనుంది. విజయవాడ బెంగళూరు వందే భారత్ రైలు సాయంతో విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం 9 గంటల్లోపే చేరుకోవచ్చు. ఇక చిత్తూరు నుంచి అయితే కేవలం 3 గంటల 11 నిమిషాల్లోనే బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు నుంచి విజయవాడ రైల్వేస్టేషన్‌కు 5 గంటల 56 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో 8 బోగీలు ఉంటాయి. ఇందులో 7 ఏసీ ఛైర్ కార్ బోగీలు కాగా.. ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ బోగీ ఉంటుంది.


విజయవాడ బెంగళూరు వందేభారత్ రైలు తెనాలి, ఒంగోలు రైల్వే స్టేషన్, నెల్లూరు రైల్వేస్టేషన్, తిరుపతి, చిత్తూరు రైల్వేస్టేషన్, కాట్పాడి, కృష్ణరాజపురంలలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. 20711 నంబరుతో విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఈ వందేభారత్ రైలు అందుబాటులో ఉంటుంది. వారంలో మంగళవారం మినహా మిగతా అన్ని రోజులూ ఉదయం 5:15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో బయలుదేరుతుంది. బెంగళూరు రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది. బెంగళూరు నుంచి తిరిగి 20712 నంబరుతో విజయవాడకు బయల్దేరుతుంది. బెంగళూరులో మధ్యాహ్నం 2: 45 గంటలకు బయల్దేరితే.. విజయవాడ రైల్వేస్టేషన్‌కు రాత్రి 11.45 గంటలకు చేరుకుంటుంది.


మరోవైపు విజయవాడ బెంగళూరు వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే తిరుపతి, విజయవాడ వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే.. ఒక్కరోజులోనే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి విజయవాడకు రావొచ్చని చెప్తున్నారు. విజయవాడ నుంచి కేవలం నాలుగున్నర గంటల్లోనే తిరుపతికి చేరుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.


విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఉదయం 5.15 గంటలకు ఈ రైలులో బయల్దేరితే.. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు తిరుపతికి చేరుకోవచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల సాయంతో శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం ఆరున్నర గంటలకల్లా తిరుపతి రైల్వేస్టేషన్ చేరుకుంటే.. బెంగళూరు- విజయవాడ వందేభారత్ రైలు సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు తిరుపతి రైల్వేస్టేషన్‌లో అందుబాటులో ఉంటుంది. అందులో బయల్దేరితే రాత్రి 11: 45 గంటలకల్లా విజయవాడకు చేరుకోవచ్చని ప్రయాణికులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa