పాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటును అధిగమించింది. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి రోజుకు సగటున 719 గ్రాముల పాలు వినియోగిస్తుండగా, జాతీయ సగటు కేవలం 459 గ్రాములుగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. 2033 నాటికి రాష్ట్రంలో పాల ఉత్పత్తిని 150 లక్షల టన్నులకు పెంచి, దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఏపీ 139.46 లక్షల టన్నుల పాల ఉత్పత్తితో దేశంలో 7వ స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పశుపోషణపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని వివరించారు.ప్రస్తుతం రాష్ట్రంలో పాలు, పాల ఉత్పత్తుల విలువ రూ. 713.9 బిలియన్లు ఉందని, దీనిని 2033 నాటికి రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం పశుపోషకులకు అనేక రాయితీలు అందిస్తోందని దామోదర్ నాయుడు పేర్కొన్నారు. 2025 అఖిల భారత పశుగణన ప్రకారం రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు ఉన్నట్లు ఆయన తెలిపారు. గత తొమ్మిదేళ్లలో జాతీయ పాల ఉత్పత్తి 58% వృద్ధి చెందిందని, దేశ ఆర్థిక వ్యవస్థకు పాల రంగం 5% తోడ్పాటు అందిస్తోందని గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa