రాయలసీమలోని సుమారు 5.98 లక్షల మంది ఉద్యాన రైతుల జీవితాల్లో కొత్త ఆశాకిరణం నింపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో కలిపి మొత్తం 92 హార్టికల్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ క్లస్టర్ల ద్వారా పండ్ల తోటల సాగును విస్తృతంగా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నాణ్యమైన మొక్కలు, సకాలంలో సలహాలు అందేలా ప్రతి క్లస్టర్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘పూర్వోదయ్’ పథకం కింద భారీ నిధులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నిధులతో పండ్ల తోటల విస్తరణ, సాగు సబ్సిడీలు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైతు నుంచి నేరుగా మార్కెట్ వరకు చైన్ను బలోపేతం చేయడం ద్వారా మధ్యవర్తుల జోక్యం తగ్గించి రైతులకు ఎక్కువ ధర లభించేలా చర్యలు తీసుకోనున్నారు.
ఈ మొత్తం కార్యక్రమాన్ని వచ్చే రెండేళ్లలోపు ఫలవంతం చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయలసీమ ఎప్పుడో కోరుకున్న ఉద్యానవన రాష్ట్రంగా మారే రోజు దగ్గర్లోనే ఉందని, ఈ పథకం ద్వారా వేలాది యువతకు ఉపాధి, రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa