ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఆస్పత్రులకు.. నిధులు మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 07:21 PM

ప్రజారోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పన, అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మూడు నియోజకవర్గాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని మూడు ఏరియా ఆస్పత్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు కేటాయించింది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగానికి ఏపీ ప్రభుత్వం ఈ మేరకు రూ.22.74 కోట్లు అదనపు నిధులు కేటాయించింది. మంగళగిరి. పిఠాపురం ఏరియా ఆస్పత్రి , చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు.


మరోవైపు మంగళగరి ఏరియా ఆస్పత్రి సామర్థ్యం ప్రస్తుతం 30 పడకలు మాత్రమే. ప్రజా అవసరాల నేపథ్యంలో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. మంగళగిరి ఏరియా ఆస్పత్రిని100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని.. ఈ ఆస్పత్రికి అదనంగా 73 పోస్టులు కేటాయించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా అదనపు పడకలు, అదనపు పోస్టుల కోసం రూ.52.20 కోట్లు కూడా కేటాయించారు. అలాగే మంగళగిరి ఏరియా ఆస్పత్రిని చినకాకాని వద్ద ఉన్న వైవీసీ క్యాన్సర్‌ ఆసుపత్రి స్థలంలో నిర్మించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి భవనం పాడవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


కార్పొరేట్ సౌకర్యాలతో మంగళగిరి ఆస్పత్రి


మరోవైపు మంత్రి నారా లోకేష్ మంగళగిరి ఏరియా ఆస్పత్రి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఆస్పత్రిని కార్పొరేట్‌ వసతులతో నిర్మించాలని.. అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఇప్పటికే సూచనలు చేశారు. మంగళగిరి ఏరియా ఆస్పత్రిని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్.. రెండు అంతస్తులో నిర్మిస్తున్నారు.


రోగులకు ఉపయోగపడేలా ఆస్పత్రిలో లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నారు. విశాలమైన పార్కింగ్ స్థలం కేటాయించనున్నారు. ఈ ఏరియా ఆస్పత్రికి మంగళగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి చికిత్స కోసం ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోగులతో పాటుగా వారి బంధువుల కూడా అసౌకర్యం కలగకుండా వసతి ఏర్పాట్లు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ఏరియా ఆస్పత్రికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa