ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమల భక్తుల రిక్వెస్ట్‌కు ఓకే చెప్పిన కేంద్రమంత్రి

national |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 08:09 PM

ప్రస్తుతం కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మండల-మకరవిళక్కు వార్షిక పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన ఈ పూజలకు.. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి.. నిత్యం లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తుతున్నారు. దీంతో రోడ్లు, రైళ్లు, విమానాల్లో భారీగా భక్తుల సందడి కనిపిస్తోంది. ఇక అయ్యప్ప మాల వేసుకునే స్వాములు.. కొబ్బరికాయ, ఇతర వస్తువులతో కట్టిన ఇరుముడిని.. విమానంలో ప్రయాణించేటపుడు.. తమతోపాటు విమానం లోపలికి క్యాబిన్ లగేజీగా తీసుకునేందుకు అనుమతి లేదు. తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు.. ఒక కీలక ప్రకటన చేశారు.


అయ్యప్ప స్వాములను విమానాల్లోకి తమ ఇరుముడులతో అనుమతించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. అయ్యప్ప స్వాములు శబరిమల దర్శనానికి వెళ్లే సమయంలో తమ ఇరుముడిని తమతో పాటు విమానంలోనే తీసుకెళ్లడం పట్ల ఉన్న పవిత్రతను భక్తి భావాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించిందని.. అందుకే ఈ మేరకు ప్రత్యేక సడలింపును ప్రకటిస్తూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.


ఇప్పటివరకు.. ఎయిర్‌పోర్టుల్లోని భద్రతా నిబంధనల ప్రకారం.. కొబ్బరికాయ వంటి వస్తువులు ఉన్న ఇరుముడిని తప్పనిసరిగా చెక్ ఇన్ లగేజీగా ఇవ్వాల్సి ఉండేది. ఇది అయ్యప్ప స్వాములకు తీవ్ర అసౌకర్యాన్ని.. మనోభావాలకు భంగం కలిగిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిపై మినహాయింపు ఇవ్వాలని పలువురు అయ్యప్ప స్వాములు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో దీనిపై దృష్టి సారించిన మంత్రి రామ్మోహన్ నాయుడు.. భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని భక్తుల కోసం ఇరుముడిని విమానాల్లోకి తీసుకెళ్లే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.


ఈ ప్రత్యేక సడలింపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ ఏడాది శబరిమల పూజలు పూర్తయ్యే 2026 జనవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు.. ఎయిర్‌పోర్టులో భద్రతా తనిఖీలను పూర్తి చేసిన తర్వాత.. తమ ఇరుముడిని తమతోపాటే విమాన క్యాబిన్‌లోకి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.


ఈ నిర్ణయం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమాన మార్గం ద్వారా శబరిమల చేరే భక్తులకు ప్రయాణ సౌలభ్యం కల్పిస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భద్రతా ప్రమాణాలకు ఎలాంటి భంగం కలగకుండానే భక్తుల సంప్రదాయాలు, ఆచారాలకు గౌరవం దక్కేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులందరూ ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించి.. వారు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని.. ఎయిర్‌పోర్టు తనిఖీ ప్రక్రియల్లో అధికారుల సూచనలను కచ్చితంగా అనుసరించాలని మంత్రి రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa