ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇరుముడి విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీగా అనుమతించండి': అయ్యప్ప భక్తుల ఆవేదన

national |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 08:22 PM

శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న అయ్యప్ప భక్తులు.. విమాన ప్రయాణంలో తమ వెంట తీసుకెళ్లే ఇరుముడి పట్ల గౌరవం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ముఖ్యంగా విమానాల ద్వారా శబరిమల వెళ్లే అయ్య భక్తుల ఇరుముడులను.. చెక్-ఇన్ బ్యాగేజీగా కాకుండా, ప్రయాణికులతో పాటు క్యాబిన్ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు అనుమతి డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాడుయు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్‌లను ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు పెట్టారు. అందులో అయ్యప్ప భక్తులు తమ బాధలను, ఇరుముడికి జరుగుతున్న అగౌరవం గురించి వివరించారు.


చెప్పులు వేసుకున్న సిబ్బంది ముట్టుకోవడం పాపం


విమాన ప్రయాణం ద్వారా శబరిమల వెళ్లే భక్తుల ఇరుముడిని ఉంచిన బ్యాగులను.. చెక్-ఇన్ ప్రక్రియలో చెప్పులు (షూస్) వేసుకున్న విమానాశ్రయ సిబ్బంది పట్టుకోవలసి వస్తోందని చెప్పారు. అయ్యప్ప దీక్షలో పాటించే నియమాల ప్రకారం ఇది పవిత్రతకు భంగం కలిగించే అంశమని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. "41 రోజులు దీక్ష చేసిన స్వామి కూడా తన ఇరుముడిని ఎత్తకూడదు, దించకూడదు. అటువంటిది పాదరక్షలు ధరించిన సిబ్బంది ఇరుముడి బాగ్స్‌ను పట్టుకోవడం ఎంత పాపమో ఒక్కసారి ఆలోచించండి" అని భక్తులు తమ విజ్ఞప్తిలో పేర్కొన్నారు.


ప్రత్యేకించి ఆరుసార్లు మాల వేసిన స్వాములు (గురుస్వాములు) తమ ఇరుముడి పవిత్రత విషయంలో అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తారని గుర్తు చేశారు. గత సంవత్సరాల్లో కొన్నిసార్లు ఇరుముడిని క్యాబిన్‌లో అనుమతించినప్పటికీ.. మరికొన్నిసార్లు అనుమతించలేదని, దీనివల్ల ప్రతిసారీ భక్తులు ఆందోళన చెందాల్సి వస్తుందని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ.. తెలుగు రాష్ట్రాల నుండి కేరళలోని కొచ్చి, తిరువనంతపురం వెళ్లే విమానాల్లో ఇరుముడిని క్యాబిన్ లోకి తీసుకెళ్లేలా శాశ్వితమైన ఉత్తర్వులు జారీ చేయాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


అయితే దీనిపై స్పందించిన కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.. ఇరుముడితో శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం పౌర విమానయాన శాఖ ద్వారా నిబంధనలు సడలించినట్లు వివరించారు. సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించవచ్చని చెప్పారు. మండలం నుంచి మకర జ్యోతి దర్శనం(జనవరి 20) వరకు కల్పించిన ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోవడంతో పాటు భద్రతా సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరుతున్నానని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa