ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిత్వా తుఫాను బీభత్సం.. విద్యా సంస్థలకు సెలవు, విమానాలు రద్దు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 08:16 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫానుతో శ్రీలంక అతలాకుతులమవుతోంది. తుఫాను కారణంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 64కు చేరుకోగా.. మరో 34 మంది ఆచూకీ గల్లంతయ్యింది. తమిళనాడులో ఈ తుఫాను ప్రభావం శుక్రవారం రాత్రి మొదలైంది. నాలుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండగా.. డెల్టా, ఉత్తర తీర జిల్లాల్లో గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తర, వాయువ్య దిశగా ప్రస్తుతం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోన్న తుఫాను పుదుచ్చేరికి దక్షిణ, ఆగ్నేయంగా 400 కి.మీ, చెన్నైకి దక్షిణంగా 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. నవంబరు 30న తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు చేరుకుంటుంది.


 దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులో అనేక చోట్ల, దక్షిణ తమిళనాడులో కొన్నిచోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మైలాడుతురై, కడలూరు, విళ్లుపురం, చెంగల్పట్టు, పుదుచ్చేరిలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చి, సేలం, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట, కారైక్కల్‌లో భారీ నుంచి అతి భారీ, వేలూర్, తిరుప్పత్తూర్, కృష్ణగిరి, ధర్మపురి, నామక్కల్, కరూర్‌లో భారీవర్షానికి అవకాశం ఉందని అంచనా వేసింది.


ఆదివారం తమిళనాడు దక్షిణ తీర, డెల్టా జిల్లాలు, కారైక్కల్‌లో గంటకు 55 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. తిరువళ్లూరు, రాణిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం, డిసెంబరు 1న తిరువళ్లూరు జిల్లాలో భారీవర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది.


నాగపట్టణం, పాంబన్, తూత్తుకుడి, కారైక్కల్‌, చెన్నై, ఎన్నూర్, కాట్టుప్పళ్లి, పుదుచ్చేరి ఓడరేవుల్లో నాలుగో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. తుఫానుతో ధనుష్కోటిని మూసివేసి, పర్యాటకులు, వ్యాపారులు, ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. తుఫాను కారణంగా వచ్చే 48 గంటల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలతో చెన్నై విమానాశ్రయంలో విమాన రాకపోకలపై పరిమితి విధించారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ 54 విమానాలను రద్దుచేశారు. దీంతో మదురై, బెంగళూరు, సేలం, తూత్తుకూడి, తిరుచ్చరాపల్లి, హైదరాబాద్, జఫ్నా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.


శనివారం పెరంబలూరు, తిరువరూర్, నాగపట్టణం, కడలూరు, కళ్లకురుచ్చి, పుదుకొట్టైయ్, పుదుచ్చేరి, కరైకల్, మైలాదుతురై జిల్లాలో విద్యా సంస్థలను మూసివేశారు. విల్లుపురం, తంజావూరు, తిరుచ్చి జిల్లాల్లో కేవలం స్కూళ్లకు మాత్రమే సెలవులు ప్రకటించారు. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ శనివారం నిర్వహించాల్సి పరీక్షలను రద్దు చేసి, సెలవు ప్రకటించింది. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అత్యవసర సమావేశం నిర్వహించి, చేపట్టాల్సిన చర్యల గురించి దిశనిర్దేశనం చేశారు. ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ దళాలను సిద్ధం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa