ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ఆండ్రీ రస్సెల్ కేకేఆర్ 'పవర్ కోచ్‌'గా కొత్త బాధ్యతలు

sports |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 08:18 PM

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్, కోల్‌కతా నైట్ రైడర్స్  స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్  కు వీడ్కోలు పలికాడు. 2026 ఐపీఎల్ మినీ వేలానికి కేవలం రెండు వారాల సమయం ఉందనగా రస్సెల్ ఈ సంచలన నిర్ణయం ప్రకటించాడు. అయితే, క్రికెటర్‌గా తప్పుకున్నప్పటికీ కేకేఆర్‌తో తన బంధాన్ని కొనసాగించనున్నాడు. జట్టు 'పవర్ కోచ్‌'గా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నట్లు వెల్లడించాడు.రస్సెల్ రిటైర్మెంట్ నిర్ణయంపై కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో స్పందించారు. "అద్భుతమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు ఆండ్రీ. మా జట్టుకు నువ్వో కవచం లాంటివాడివి. కేకేఆర్‌కు నీ సేవలు మరువలేనివి. క్రీడాకారుడిగా నీ ప్రయాణంలో ఇది మరో అద్భుత అధ్యాయం. ఇకపై 'పవర్ కోచ్'‌గా మా కుర్రాళ్లకు నీ అనుభవాన్ని, శక్తిని పంచుతావని విశ్వసిస్తున్నాను. నీకు పర్పుల్ అండ్ గోల్డ్ జెర్సీ తప్ప మరేదీ సరిపోదు. మజిల్ రస్సెల్ ఫర్ లైఫ్!" అంటూ షారూఖ్ ట్వీట్ చేశారు.కాగా, ఈ కొత్త బాధ్యతలు చేపట్టే ముందు తాను షారూఖ్‌తో చాలాసార్లు చర్చించినట్లు రస్సెల్ తన వీడియోలో తెలిపాడు. అభిషేక్ నాయర్ నేతృత్వంలోని కొత్త కోచింగ్ బృందంలో రస్సెల్ చేరనున్నాడు. ఈ బృందంలో షేన్ వాట్సన్, టిమ్ సౌథీ కూడా ఉన్నారు. కేకేఆర్ తరఫున తన కెరీర్‌లో రస్సెల్ 2,593 పరుగులు చేయడంతో పాటు 122 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ఆరంభంలోనే ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa