ట్రెండింగ్
Epaper    English    தமிழ்

33 అడుగుల పొడవు.. రూ.3 కోట్లు....ఏపీలో దర్శనమిచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 08:42 PM

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ హైవే మీద ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా శివలింగం దర్శనం ఇచ్చింది. 33 అడుగుల పొడవుతో.. 210 టన్నుల బరువున్న భారీ రాతి శివలింగాన్ని చూసి శివయ్య భక్తులు మురిసిపోతున్నారు. ఈ శివలింగాన్ని దర్శించుకున్నందుకు తమ జన్మ ధన్యం అయ్యింది అంటున్నారు. మరి ఇంత భారీ శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించబోతున్నారు.. ఎక్కడ రూపుదిద్దుకుంది.. ఎంత ఖరీదు అయ్యింది వంటి ఆసక్తికర వివరాలు తెలియాలంటే ఇది చదవండి.


ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఈ శివలింగాన్ని బిహార్‌లోని చంపారన్ జిల్లాలో ప్రతిష్ఠించనున్నారు. దీన్ని తమిళనాడులోని మహాబలిపురం నుంచి చంపారన్ తరలిస్తున్నారు. 114 టైర్లున్న భారీ హైడ్రాలిక్ ట్రక్కు మీద ఈ శివలింగాన్ని తరలిస్తున్నారు. ఈక్రమంలో ఆళ్లగడ్డ హైవే మీద ఈ భారీ శివలింగం దర్శనం ఇచ్చింది. ఇది గమనించిన స్థానికులు ఏపీలో దర్శనం ఇచ్చిన అత్యంత ఎత్తైన శివలింగం అంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.


ఇక ఈ శివలింగం ప్రతిష్ఠ విషయానికి వస్తే.. చంపారన్ జిల్లా, చాకియా కేసరియా వద్ద విరాట్ రామాయణ ఆలయం నిర్మిస్తున్నారు. ఈ గుడిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా శివలింగాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. మహవీర్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విరాట్ రామాయణ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ శివలింగాన్ని గ్రానైట్‌తో చెక్కారు. దీన్ని చెక్కడానికి 10 సంవత్సరాలు పట్టింది. మహాబలిపురంలో ఒకే ఒక్క భారీ గ్రానైట్ శిలను ఎంచుకుని దీన్ని చెక్కారు.


ఈ శివలింగం సుమారు 33 అడుగుల పొడవు ఉంది. 210 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ శివలింగం విలువు రూ.3 కోట్లు. మహాబలిపురం నుంచి బిహార్ చేరడానికి దాదాపు 20-25 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. శివలింగం బరువును దృష్టిలో ఉంచుకుని దీన్ని తరలించడానికి.. 114 టైర్లున్న హైడ్రాలిక్ ట్రక్‌ని వినియోగిస్తున్నారు. ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం పర్యవేక్షణలో.. ఈ భారీ శివలింగాన్ని బిహార్ కు తరలిస్తున్నారు. శివలింగాన్ని ప్రతిష్టించబోయే విరాట్ రామాలయం ఎత్తు... కంబోడియాలోని 12వ శతాబ్దపు అంగ్కోర్ వాట్ ఆలయం కన్నా మరింత ఎత్తుగా ఉండేలా డిజైన్ చేసి నిర్మిస్తున్నారు.


ఇక ఈ ఏకశిలా శివలింగం యాత్రకు.. దారి పొడవునా ఘన స్వాగతం పలకడానికి ఆయా ప్రాంతాల భక్తులు, ఆలయ కమిటీలు రెడీ అవుతున్నాయి. మహాబలిపురం నుంచి చాకియా వరకు వెళ్లే మార్గంలో.. అనేక నగరాల్లో ఊరేగింపులు, దర్శనం కోసం ప్రత్యేక వేదికలు నిర్మిస్తున్నారని తెలుస్తోంది. వేద పండితులు నిర్ణయించిన ప్రత్యేక శుభ ముహూర్తంలో ఈ భారీ, ఎత్తైన శివలింగానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa