ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారందరికీ త్వరలోనే పింఛన్లు.. మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 09:13 PM

హెచ్ఐవీ బాధితులకు ఏపీ ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. హెచ్ఐవీ బాధితులకు త్వరలోనే పింఛన్లు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో సుమారుగా 42 వేల మంది హెచ్ఐవీ బాధితులకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని మంత్రి వివరించారు. అర్హులైన మిగతా వారికి కూడా త్వరలోనే పింఛన్లు మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎయిడ్స్/హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. హెచ్ఐవీ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . అవగాహనతోనే ఎయిడ్స్/ హెచ్ఐవీకి దూరంగా ఉండొచ్చని సూచించారు.మరోవైపు ఐటీ ఉద్యోగుల్లో హెచ్ఐవీ కేసులు పెరుగుతూ ఉండటం పట్ల సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. లగ్జరీ లైఫ్, డ్రగ్స్ వాడకం వంటి కారణాలతోనే ఈ తరహా ధోరణి కనిపిస్తోందన్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పరిశీలనలో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో హెచ్ఐవీ వ్యాప్తి పెరుగుతున్నట్లు తేలిందని.. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కూడా ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని.. సేఫ్ సెక్స్ విధానాలు పాటించాలన్నారు.


మరోవైపు హెచ్ఐవీ బాధితుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైన సందర్భంలో వారికి ఆపరేషన్లు చేయాల్సి వస్తే.. కొంతమంది వైద్యులు నిరాకరిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో డీఎంఅండ్ హెచ్ ఓలకు ఫిర్యాదు చేసి సహాయం పొందవచ్చని వివరించారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే తమ దృష్టికి తేవాలని సూచించారు. 2030 నాటికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎయిడ్స్‌రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.


హెచ్ఐవీ కొత్త కేసులను నియంత్రించడంలో ఏపీ తొలి స్థానంలో ఉందని.. 2030 నాటికి కొత్త కేసులు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. హెచ్ఐవీ బాధితుల్లో 42 వేలమందికి పింఛన్లు ఇస్తున్నామన్న మంత్రి... 95 వేల దరఖాస్తులు వచ్చాయని.. వాటిని పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa