తొమ్మిదేళ్ల బాలుడు వేదమూర్తి దేవవ్రత మహేష్ రేఖే సాధించిన అద్భుతమైన ఘనతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. కాశీ నగరంలో ఈ బాలుడు ప్రదర్శించిన అసాధారణ ప్రతిభను, రాబోయే తరాలు సైతం గుర్తుంచుకుంటాయని ఆయన కొనియాడారు. కాశీ ఎంపీగా అతని ఘనత పట్ల గర్విస్తున్నానని తెలిపారు.దేవవ్రత కేవలం 50 రోజుల వ్యవధిలో, ఎలాంటి ఆటంకాలు లేకుండా శుక్ల యజుర్వేదంలోని మధ్యందిని శాఖకు చెందిన 2000 వేద మంత్రాలను దండక్రమ పారాయణం రూపంలో పూర్తి చేశాడు. ఎన్నో పవిత్ర శ్లోకాలను, పదాలను దోషరహితంగా పఠించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత ప్రతిభపై స్పందించిన ప్రధాని, భారతీయ సంస్కృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ బాలుడి పట్ల గర్వపడతారని అన్నారు. దేవవ్రత మన గురు పరంపరకు నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించారు."కాశీ ఎంపీగా, ఈ పవిత్ర నగరంలో ఈ అద్భుతం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవవ్రత కుటుంబ సభ్యులకు, అతనికి మద్దతుగా నిలిచిన సాధువులు, పండితులు, సంస్థలకు నా ప్రణామాలు తెలియజేస్తున్నాను" అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ చిన్న వయసులోనే దేవవ్రత సాధించిన ఘనత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa