పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు చేసిన సోషల్ మీడియా పోస్ట్ దేశ రాజకీయాల్లో భారీ వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రధాని నరేంద్ర మోదీని 'చాయ్వాలా'గా చూపుతూ రూపొందించిన ఏఐ జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేయడంతో.. భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాగిణి నాయక్ పోస్ట్ చేసిన ఆ వీడియోలో ప్రధాని మోదీ ఒక గ్లోబల్ ఈవెంట్లో కెటిల్, గ్లాసుల చేతితో పట్టుకుని నడుస్తున్నట్లుగా ఉంది.
2014 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్.. మోదీ 'చాయ్వాలా' నేపథ్యాన్ని హేళన చేశారు. ఇది జరిగిన పదేళ్లకు రాగిణి నాయక్ చేసిన ఈ వ్యాఖ్య మరోసారి అదే చాయ్ వివాదాన్ని రాజేసింది. ఈ వీడియోపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సీఆర్ కేశవన్ మాట్లాడుతూ.. రాగిణి నాయక్ పోస్ట్ కాంగ్రెస్ నాయకత్వం యొక్క దిగజారిన మనస్తత్వాన్ని బయటపెట్టిందని విమర్శించారు. ఈ అసహ్యకరమైన ట్వీట్ 140 కోట్ల మంది కష్టపడి పనిచేసే ప్రతిభావంతులైన భారతీయులకు తీవ్ర అవమానం అని అన్నారు. ఇది ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) వర్గంపై కాంగ్రెస్ చేసిన ప్రత్యక్ష దాడి అని సీఆర్ కేశవన్ పేర్కొన్నారు. అహంకారి అయిన రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరిస్తున్నారనే వాస్తవాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. పేద కుటుంబ నుంచి వచ్చిన OBC కమ్యూనిటీకి చెందిన 'కామ్దార్' (కష్టపడే) ప్రధానిని నామ్దార్ (కుటుంబ పేరు చెప్పుకుని బతికే) కాంగ్రెస్ భరించలేకపోతోందని ఎద్దేవా చేశారు. గతంలో కూడా కాంగ్రెస్ మోదీని, ఆయన తల్లిని అవమానించిందని.. అలాంటి పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని ఆయన హెచ్చరించారు.
ఈ వివాదం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గందరగోళంగా మారడానికి దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం చట్టపరమైన ఎజెండాకు సిద్ధం అవుతుండగా.. ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షం సిద్ధమవుతోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa