ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో మ్యాచ్‌లో గెలిచిన సౌతాఫ్రికా.. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 359 పరుగులు

sports |  Suryaa Desk  | Published : Wed, Dec 03, 2025, 11:37 PM

భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో సౌతాఫ్రికా రికార్డు స్కోరు ఛేజ్ చేసింది. బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. వన్డే క్రికెట్‌లో తమ మూడో అత్యధిక రన్‌ ఛేజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. డిసెంబర్ 6న నిర్ణయాత్మక మూడో వన్డే విశాఖ వేదికగా జరగనుంది.


359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ క్వింటన్ డికాక్ (8) వికెట్ కోల్పోయింది. అయితే ఈ సమయంలో ఓపెనర్ ఎయిడెన్ మార్‌క్రమ్‌కు టెంబా బవూమా జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 96 బంతుల్లోనే 101 పరుగులు స్కోరు చేశారు. 46 పరుగులు చేసిన అనంతరం బవూమా ఔట్ అయ్యాడు. ఈ సమయంలో మాథ్యూ బ్రీట్జ్‌ కే (64 బంతుల్లో 68 రన్స్‌) అదరగొట్టాడు. సమయోచితంగా ఆడుతూ.. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.


ఈ క్రమంలోనే మార్‌క్రమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 98 బంతుల్లో 110 రన్స్ చేశాక.. అతడు పెవిలియన్ చేరిపోయాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డివాల్డ్ బ్రెవిస్.. పెను విధ్వంసం సృష్టించాడు. టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 34 బంతుల్లో 54 రన్స్ చేసి.. సౌతాఫ్రికాకు విజయాన్ని సులువు చేశాడు. చివర్లో కార్బిన్ బాష్ (15 బంతుల్లో 29 పరుగులు) కూడా సత్తాచాటడంతో సౌతాఫ్రికా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు. హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ సెంచరీలతో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఫలితంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో వన్డే డిసెంబర్ 6న విశాఖ వేదికగా జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa