ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా వివాహం రద్దయిన మాట వాస్తవమే

sports |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 04:26 PM

భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన స్వయంగా తన ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ అభిమానులు, మీడియాకు ఆమె విజ్ఞప్తి చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న స్మృతి మంధాన ఇటీవల పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్దమైంది. ఈ నెల 23న వివాహానికి ముంబైలో ఏర్పాట్లు కూడా జరిగాయి. సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా జరగగా.. చివరి నిమిషంలో వివాహం ఆగిపోయింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, శ్రీనివాస్ మంధాన కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో స్మృతి, పలాశ్ ల వివాహం రద్దయినట్లేనని ప్రచారం జరిగింది. ఎంగేజ్‌మెంట్ ప్రపోజల్, హల్దీ, మోహందీ వేడుకలకు సంబంధించిన వీడియోలు స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల్లోంచి తొలగించడంతో ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. అయితే, ఈ వార్తలపై ఇటు స్మృతి కానీ అటు పలాశ్ కానీ స్పందించలేదు. పలాశ్ కుటుంబం మాత్రం వివాహం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. స్మృతి సందేశం చూస్తే .... ‘నా వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి చూపించడానికి నేను ఇష్టపడను. అయితే, కొన్నిరోజులుగా నా జీవితంపై వదంతులు వస్తున్న క్రమంలో స్పందించాల్సి వస్తోంది. పలాశ్ తో నా వివాహం రద్దు అయింది. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ వదిలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక నా దృష్టంతా క్రికెట్ పైనే... జాతీయ జట్టుకు శక్తిమేర సేవలు అందిస్తాను’ అంటూ స్మృతి తన పోస్టులో వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa