ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 సిరీస్‌లో భారత్ బోణీ,,,74 పరుగులకే కుప్పకూలిన ప్రొటీస్‌

sports |  Suryaa Desk  | Published : Tue, Dec 09, 2025, 11:20 PM

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను భారత్ విజయంతో ఆరంభించింది. కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాట్, బంతితో సత్తాచాటి.. ప్రొటీస్ టీమ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 175/6 పరుగులు చేసింది. అనంతరం సౌతాఫ్రికాను 74 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టీ20 డిసెంబర్ 11న ముల్లాన్‌పూర్ వేదికగా జరగనుంది.


భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి ఓవర్‌లో రెండో బంతికే క్వింటన్ డికాక్ (0) సున్నా చుట్టేశాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (14), మార్‌క్రమ్ (14), డేవిడ్ మిల్లర్ (1), ఫెర్రీరా (5), మార్కో జాన్సెన్ (12) విఫలమయ్యారు. డివాల్డ్ బ్రెవిస్ (14 బంతుల్లో 22 రన్స్‌) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది.


సౌతాఫ్రికా బ్యాటర్లలో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. ఇక భారత బౌలర్లలో బౌలింగ్‌ చేసిన ప్రతీ ఒక్కరికి వికెట్ దక్కింది. అర్షదీప్ సింగ్ 2, జస్‌ప్రీత్ బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా , శివమ్ దూబె ఒక్కో వికెట్ తీశారు. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 రన్స్‌) హాఫ్ సెంచరీతో 175/6 పరుగులు చేసింది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌ 2-1తో కైవసం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. తాజా ఫలితంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. డిసెంబర్ 11న ముల్లాన్‌పూర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa