ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాక్స్‌పేయర్లకు సెక్షన్ 143 (1) నోటీసులు.... ఏం చేయాలి?

business |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 10:57 PM

భారతదేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థ అమల్లో ఉంది. ఇక్కడ నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే.. సదరు ఆర్థిక సంవత్సరం ఆదాయంపై.. మరుసటి ఆర్థిక సంవత్సరం లేదా ప్రస్తుత అసెస్‌మెంట్ ఇయర్‌లో (మదింపు సంవత్సరం) ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే కిందటి ఆర్థిక సంవత్సరం (2024-25) ఆదాయంపై.. ప్రస్తుత మదింపు సంవత్సరంలో (2025-26) ఐటీఆర్ దాఖలు చేయాలి. ప్రస్తుతం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 2025, సెప్టెంబర్ 16తోనే గడువు ముగిసింది. ఇక్కడ ఐటీఆర్ గడువులోపే ఫైల్ చేసినప్పటికీ.. కొన్నిసార్లు నోటీసులు అందుకుంటుంటారు. ఇక్కడ అసలేమైందో తెలియక ముందే ఐటీ శాఖ నుంచి నోటీసులు అంటే పన్ను చెల్లింపుదారులు భయపడిపోతుంటారు.


ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత వచ్చే ముఖ్యమైన పత్రాల్లో సెక్షన్ 143 (1) కింద అందే ఇంటిమేషన్ నోటీసుల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇది మీ ఐటీఆర్ ప్రాసెసింగ్ పూర్తయినట్లు తెలియజేస్తుంది. అందుకే.. నోటీసు వస్తే భయపడకుండా అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇతర ఐటీ నోటీసులు కూడా.. ఐటీఆర్‌లో ఏమైనా సమస్య ఉంటే.. దానిని తెలియజేసే రాతపూర్వక సమాచారం అని తెలుసుకోవాలి. కొన్ని సార్లు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మళ్లీ రాకుండా చూసుకోవాలని ఇంటిమేషన్ ఇస్తుంటారు.


>> మీరు ఫైల్ చేసిన ఐటీఆర్‌ను ఆదాయపు పన్ను శాఖ.. ప్రాసెసింగ్ చేస్తుంది. ఇక్కడ మీరు నివేదించిన ఆదాయం, టీడీఎస్, మినహాయింపులు, ఇతర చెల్లించిన పన్ను వివరాలు అన్నీ ఐటీ శాఖ వద్ద ఉన్న రికార్డులతో సరిపోలాయో లేదో చూస్తుంది. ఇక్కడ మీరు ఐటీ రిటర్న్స్‌లో పేర్కొన్న లెక్కలు.. ఐటీ శాఖ రికార్డులతో సరిపోలకపోతే అప్పుడు ఈ సెక్షన్ 143(1) నోటీసుల ద్వారా మీరు అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుందా.. లేకపోతే రిఫండ్ వస్తుందా అనే విషయాన్ని తెలియజేస్తుంది. ప్రధానంగా ఇక్కడ మీరు రిపోర్ట్ చేసిన లెక్కలు.. పన్ను శాఖ లెక్కల్ని పోల్చి చూడటమే అని తెలుసుకోవాలి.


ఎలాంటి సందర్భాల్లో ఇంటిమేషన్ నోటీసులు వస్తాయంటే.. ముందుగా మీరు అధిక పన్ను చెల్లించినట్లయితే.. మీకు ఎంత మొత్తం రిఫండ్ వస్తుందో ఈ నోటీసులో వివరంగా తెలుపుతారు. రెండో సందర్భం.. మీరు ఐటీ శాఖ లెక్కల కంటే తక్కువ పన్ను చెల్లించినట్లయితే.. ఇంకా బకాయి ఎంత కట్టాలో తెలియజేస్తుంది. దానిని ఎలా చెల్లించాలో కూడా ఉంటుంది. చివరగా.. మీరు దాఖలు చేసిన పన్ను వివరాలు.. ఐటీ శాఖ రికార్డులతో సరిపోలినా నోటీసు వస్తుంది. అప్పుడు మీరేం చేయాల్సిన అవసరం లేదు.


సెక్షన్ 143 (1) ఇంటిమేషన్ నోటీసు.. పీడీఎఫ్ ఫైల్‌లో పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. చాలా మంది దీనిని ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ చిన్న అక్షరాల్లో పాన్ కార్డు నంబర్ + పుట్టిన తేదీని (DDMMYYYY) ఫార్మాట్‌లో ఎంటర్ చేయాలి. పాన్ కార్డు నంబర్ ABCDEF4321F.. పుట్టిన తేదీ 11/12/2000 అయితే.. పాస్‌వర్డ్ abcdef4321f11122000 ఇలా ఉంటుందన్నమాట.


నోటీసుకు ఎలా స్పందించాలంటే.. ముందుగా ఐటీ పోర్టల్‌లోకి లాగిన్ అయి.. నోటీస్ డౌన్‌లోడ్ చేస్కొని.. మీరు ఫైల్ చేసిన రిటర్న్‌తో పోల్చి చూడాలి. అక్కడ ఏమైనా తేడాలు ఉన్నాయో గమనించాలి. తేడా ఉంటే.. అదనపు పన్ను చెల్లించాల్సి వస్తే చెల్లించాలి. తేడాను మీరు ఒప్పుకోకుంటే.. ఆన్‌లైన్‌లో బదులివ్వాలి. ఐటీ పోర్టల్‌లోనే ఇ- ప్రొసీడింగ్స్ సెక్షన్‌లో ఇ- అసెస్‌మెంట్/ప్రొసీడింగ్స్‌లో.. నోటీసు సెలక్ట్ చేస్కొని.. మీ స్పందన తెలియజేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa