ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ రాజధానిలో కమలం జెండా.. తిరువనంతపురం తొలి బీజేపీ మేయర్

national |  Suryaa Desk  | Published : Sun, Dec 14, 2025, 08:30 PM

కేరళ రాజధానిలో కమలం పార్టీ జెండా ఎగురవేసింది. తిరువనంతపురంలో 45 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలికి కార్పొరేషన్ పగ్గాలు చేపట్టేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది భారతీయ జనతా పార్టీ. బీజేపీ మొత్తం 101 వార్డుల్లో 50 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. సీపీఐ (ఎమ్) నేతృత్వంలోని డెమొక్రటిక్ ఫ్రంట్ 29, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 19 స్థానాల్లో గెలిచాయి. ఇక రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అయితే సస్తమంగళం డివిజన్‌లో భారీ మెజార్టీతో గెలుపొందారు బీజేపీ అభ్యర్థి ఆర్ శ్రీలేఖ. తిరువనంతపురం మేయర్‌గా ఆమెకే బీజేపీ అవకాశం ఇస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది.


ఎవరీ శ్రీలేఖ?


1987 బ్యాచ్‌ ఐపీఎస్ ఆఫీసర్ అయిన శ్రీలేఖ తిరువనంతపురంలో పుట్టి పెరిగారు. కేరళ మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణిగా నిలిచారు. దాదాపు 33 ఏళ్ల పాటు సాగిన తన కెరీర్‌లో.. అనేక జిల్లాల్లో పోలీసు విభాగాలకు నాయకత్వం వహించారు. అంతేకాకుండా సీబీఐ, కేరళ క్రైమ్ బ్రాంచ్, విజిలెన్స్, ఫైర్ ఫోర్స్, మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్, జైళ్ల శాఖతో సహా కీలక ఏజెన్సీలలో బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో ఆర్ శ్రీలేఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా (డీజీపీ) పదోన్నతి పొందారు. కేరళలో ఆ హోదాను పొందిన మొదటి మహిళగా నిలిచారు. సీబీఐలో పనిచేస్తున్న సమయంలో ఆమె నిర్భయంగా దాడులు దాడులు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో ఆమెను 'రైడ్ శ్రీలేఖ' అని పిలిచేవారు. 33 ఏళ్లకు పైగా సర్వీస్‌లో ఉండి.. డిసెంబర్ 2020 డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు.


డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా శ్రీలేఖ స్పాట్‌లైట్‌లో ఉన్నారు. 2017లో తోటి నటిపై లైంగిక దాడి కేసులో నటుడు దిలీప్‌ను అన్యాయంగా ఇరికించారని ఆమె సంచలన వ్యాఖ్యల చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ బహిష్కృత నాయకుడు రాహుల్ మమ్‌కూటతిల్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు దాఖలు చేయడంలో పోలీసులు చేస్తున్న జాప్యంపై ప్రశ్నించారు.


రాజకీయాల్లోకి..


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్ల ప్రభావితమయ్యానని.. 2024 అక్టోబర్‌లో శ్రీలేఖ రాజకీయాల్లో చేరారు. అయితే తన పోలీస్ కెరీర్‌లో తనకు ఎలాంటి రాజకీయ అనుబంధాలు లేవని, రాజకీయ పక్షపాతం లేకుండా పనిచేశానని శ్రీలేఖ స్పష్టం చేశారు. కాగా తిరువనంతపురంలో బీజేపీ సాధించిన విజయం నేపథ్యంలో.. మేయర్‌ అభ్యర్థిగా శ్రీలేఖను ఎంపిక చేస్తారా లేదా అనేదానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa