ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాల పునర్విభజన.. ఫైనల్ నోటిఫికేషన్‌కు ముహూర్తం ఫిక్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 07:47 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సీఎం చంద్రబాబు జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై శనివారం రోజున సచివాలయంలో.. మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాల మీద చర్చించారు. ఈ సమావేశంలోనే ఏపీలో జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు మంత్రులకు, అధికారులకు కీలక సూచనలు చేశారు.రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మదనపల్లె, పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు నవంబర్ నెలాఖరులో ప్రకటించింది. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలం ఏర్పాటుపైనానవంబర్ 27న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఈ ప్రాథమిక నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు తెలపడానికి ఏపీ ప్రభుత్వం నెల రోజులు సమయం ఇచ్చింది. ఈ గడువు డిసెంబర్ 27తో పూర్తికాగా.. ప్రాథమిక నోటిఫికేషన్‌ మీద వ్యక్తమైన అభ్యంతరాలపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 927 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అభ్యంతరాల పరిశీలన అనంతరం.. మార్పులు, చేర్పులతో డిసెంబర్ 31వ తేదీన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది.


మరోవైపు జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రాజంపేటను వైఎస్సార్ కడప జిల్లాలో కలిపి, రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై ఏపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే కురిచేడు, దొనకొండ ప్రాంతాలను మార్కాపురం జిల్లాలో కలపటంతో పాటుగా.. పొదిలిని ప్రకాశం జిల్లాలో కలపాలనే ప్రతిపాదనపైనా చర్చించినట్లు సమాచారం. రైల్వే కోడూరును తిరుపతిలో, గూడూరును నెల్లూరులో కలపాలనే ప్రతిపాదనపైన చర్చించినట్లు తెలిసింది. ఈ విషయం మీద మరోసారి సమావేశమై.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తర్వాత డిసెంబర్ 31వ తేదీన తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు.


మరోవైపు రంపచోడవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లాతో పాటుగా.. మార్కాపురం వాసులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నట్లుగా మార్కాపురం ప్రత్యేక జిల్లాగా, మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయాలని నవంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను పరిశీలించిన అనంతరం.. సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa