ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరెస్సెస్పై ప్రశంసలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలు,,,,మొన్న డీకే శివకుమార్, నిన్న శశిథరూర్, నేడు డిగ్గీ రాజా

national |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 07:53 PM

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఎప్పుడూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై విమర్శలు గుప్పించే ఆయన.. అనూహ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక పాత ఫోటోను షేర్ చేస్తూ సంఘ్ పరివార్ సంఘటనా శక్తిని ప్రశంసించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ సామాన్య కార్యకర్తగా ఉన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత బలాన్ని దిగ్విజయ్ సింగ్ ప్రశంసించడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణం అయింది. సొంత పార్టీ నాయకత్వానికి, గాంధీ కుటుంబానికి ఒక మెసేజ్ పంపేందుకు ఆయన ఇలా చేశారని విశ్లేషకులు భావిస్తుండగా.. దీన్ని కాంగ్రెస్ అంతర్గత సంక్షోభానికి నిదర్శనంగా బీజేపీ అభివర్ణించింది.


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) సమావేశం జరుగుతున్న సమయంలోనే దిగ్విజయ్ సింగ్ చేసిన ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 1990వ దశకంలో గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకార వేడుకలో తీసిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను తాజాగా దిగ్విజయ్ సింగ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో యువకుడిగా ఉన్న నరేంద్ర మోదీ , సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ.. పాదాల దగ్గర కింద నేలపై కూర్చుని ఉన్నారు.


ఈ ఫోటోను షేర్ చేసిన దిగ్విజయ్ సింగ్.. "ఈ ఫోటో చాలా ప్రభావవంతంగా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ స్థాయి కార్యకర్త, జనసంఘ్, బీజేపీ వర్కర్ ఎలా ఎదిగారో ఇది చూపిస్తుంది. పార్టీ అగ్రనాయకుల పాదాల దగ్గర నేలపై కూర్చున్న ఒక సామాన్య కార్యకర్త.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా ఎదగడం అనేది ఆ సంస్థ శక్తికి నిదర్శనం. జై సియా రామ్" అని తన పోస్ట్‌ను ముగించారు.


కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్.. బీజేపీ ఎదురుదాడి


ఇక దిగ్విజయ్ సింగ్ చేసిన పోస్ట్‌ను బీజేపీ ఆయుధంగా మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సంస్థగా మారిందని.. అక్కడ కేవలం ఒకే కుటుంబంలో పుట్టిన వారికే నిర్ణయాధికారం ఉంటుందని దిగ్విజయ్ సింగ్ మాటలు స్పష్టం చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సంస్థాగతంగా విఫలమైందని దిగ్విజయ్ సింగ్ పరోక్షంగా చెప్పారని.. ఇది కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు నిదర్శనమని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎద్దేవా చేశారు.


ఇక తాను పెట్టిన పోస్ట్ తీవ్ర వివాదానికి దారి తీయడంతో దిగ్విజయ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం సంఘటనా శక్తిని (సంస్థ బలాన్ని) మాత్రమే ప్రశంసించానని చెప్పారు. తాను ఎప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్, మోదీ విధానాలకు వ్యతిరేకినే అని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీలో కూడా ఇలాంటి సంస్థాగత సంస్కరణలు రావాలని.. అధికారం వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.


అయితే ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌.. ఆరెస్సెస్‌‍పై ప్రశంసలు గుప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా కర్ణాటక అసెంబ్లీలోనే ఆరెస్సెస్ గేయం ఆలపించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కూడా బీజేపీపై, నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ప్రతిపక్ష ఎంపీలతో కూడిన బృందంలో శశిథరూర్‌ను పంపించారు. ఆ తర్వాత ఇటీవల పుతిన్ భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు రాహుల్, ఖర్గేలను కూడా కాదని శశిథరూర్‌కు ఆహ్వానం పలకడం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa