ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆల్ టైమ్ హైకి చేరి ఒక్కసారిగా పడిపోయిన రిలయన్స్ షేరు

business |  Suryaa Desk  | Published : Mon, Jan 05, 2026, 11:43 PM

భారత స్టాక్ మార్కెట్లు గత వారం రాణించగా.. ఈ వారం మళ్లీ ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. కిందటి వారమేమో అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు మంచి లాభాల్ని నమోదు చేయగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా మరోసారి అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. వెనెజువెలాపై అమెరికా 2 రోజుల కిందట మెరుపు దాడులు నిర్వహించి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోనే బంధించింది. ఇది అంతర్జాతీయంగా అనిశ్చితులకు కారణమైంది. ముఖ్యంగా విశేషంగా చమురు నిల్వలు ఉన్న వెనెజువెలాపై అమెరికా ఆధిపత్యం నేపథ్యంలో.. చమురు మార్కెట్‌ ఎలా ప్రభావితం అవుతుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనం అవుతున్నాయి.


ఆరంభంలో ఒక దశలో మంచి లాభాల్లోనే కదలాడాయి. సెన్సెక్స్ 100, నిఫ్టీ 40 పాయింట్ల వరకు పెరిగింది. తర్వాత ఒక్కసారిగా దిగొచ్చాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో జనవరి 5న మధ్యాహ్నం 3 గంటలకు సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా నష్టంతో 85,540 స్థాయిలో ఉంది. నిఫ్టీ చూస్తే 60 పాయిండట్ల పతనంతో 26,270 స్థాయిలో ఉంది.


మార్కెట్లు ఆరంభంలో లాభాల్లో ఉన్న క్రమంలో దేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీగా ఉన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు దూసుకెళ్లింది. శుక్రవారం సెషన్‌లో రూ. 1592.30 వద్ద క్లోజ్ అవగా.. ఇవాళ జనవరి 5న స్వల్ప లాభంలో ఓపెన్ అయింది. మళ్లీ అదే స్థాయిలో దూసుకెళ్లి ఇంట్రాడేలో ఒక శాతానికిపైగా పెరిగి రూ. 1611.80 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఇదే ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర కావడం విశేషం. దీంతో ఇన్వెస్టర్లకు ఈ మార్కు వద్ద మంచి లాభాలు వచ్చాయి.


>> తర్వాత ఎప్పుడైతే అమ్మకాలు వెల్లువెత్తాయో.. రిలయన్స్ షేరు ధర పతనం మొదలైంది. గరిష్ఠ స్థాయి నుంచి 2 శాతానికిపైగా పడిపోయి ఇంట్రాడేలో మళ్లీ రూ. 1577 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం కూడా ఒక శాతం వరకు నష్టంతో రూ. 1580 స్థాయిలో ట్రేడవుతోంది. దీంతో ఇన్వెస్టర్లకు మళ్లీ నష్టాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 21.39 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర చూస్తే రూ. 1114.85 గా ఉంది. ఏడాది వ్యవధిలో రిలయన్స్ షేరు ధర 30 శాతం వరకు పుంజుకుంది. వెనెజువెలాపై అమెరికా దాడి.. చమురు మార్కెట్‌లో సంక్షోభం సృష్టిస్తుందన్న కారణాలతో ఇన్వెస్టర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే చమురు మార్కెట్‌లో దేశీయంగా అగ్రగామిగా ఉన్నటువంటి రిలయన్స్ షేర్లు పడిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa