గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన అంతర్జాతీయ స్థిరీకరణ దళంలో (ISF) పాకిస్థాన్ సైన్యం ఉండటాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్తో కలిసి పనిచేయడం తమకు ఇబ్బందికరంగా ఉంటుందని భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రేవూవెన్ అజార్ వ్యతిరేకించారు. హమాస్కు, పాకిస్థాన్లోని లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు మధ్య పెరుగుతున్న సంబంధాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో భవిష్యత్తులో ఎలాంటి ఏర్పాటు జరగాలన్నా, హమాస్ను పూర్తి ఉగ్రవాద సంస్థగా నిర్మూలించాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు.
అమెరికా సైన్యంలో పాకిస్థాన్ పాత్ర
అమెరికా ప్రతిపాదిత అంతర్జాతీయ స్థిరీకరణ దళంలో పాకిస్థాన్ సహా పలు దేశాల సైన్యాలు భాగస్వామ్యం గురించి వస్తోన్న నివేదికలపై అజార్ స్పందిస్తూ.. గాజాలో పాక్ సైన్యం భాగస్వామ్యం ఇజ్రాయెల్కు అసౌకర్యంగా ఉందని అజార్ తెలిపారు. ‘‘హమాస్ను నిర్మూలించకుండా ముందుకు వెళ్లడం అసాధ్యం. దీనికి ప్రత్యామ్నాయం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. తమ సైన్యాన్ని పంపడానికి చాలా దేశాలు వెనుకడుగు వేస్తున్నట్టు సంకేతాలు పంపుతున్నాయని, ఎందుకంటే వారు హమాస్తో పోరాడటానికి సిద్ధంగా లేరని, ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థిరీకరణ దళం ఆలోచన అర్థరహితమని ఆయన అభిప్రాయపడ్డారు. గాజాలో పాకిస్థాన్ సైన్యం పాత్రపై అడిగిన ప్రశ్నకు.. ఇజ్రాయెల్ రాయబారి ‘లేదు’ అని ఆయన గట్టిగా సమాధానమిచ్చారు.
హమాస్పై ఇజ్రాయెల్ వైఖరి
ఇజ్రాయెల్ తక్షణ ప్రాధాన్యతలు బందీలు, మరణించిన వారి అవశేషాలను తిరిగి తీసుకురావడం, హమాస్ సైనిక, రాజకీయ వ్యవస్థను నాశనం చేయడం అని అజార్ తెలిపారు. హమాస్, టర్కీ, ఖతార్ వంటి దేశాలు ఈ ముఖ్యమైన అవసరాలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘హమాస్ను నిర్మూలించాలి.. లేదంటే శాంతి ప్రణాళికలో రెండో దశను అమలు చేయడం అసాధ్యం’ అని ఆయన హెచ్చరించారు. దౌత్యపరమైన ఒత్తిడి విఫలమైతే, ఇజ్రాయెల్ తనంతట తానుగా చర్య తీసుకోవాల్సి వస్తుందని ఆయన తేల్చిచెప్పారు.
సాధారణంగా విశ్వసించేవారితోనూ, సరైన దౌత్య సంబంధాలున్నవారితోనూ కలిసి పనిచేస్తామని అజార్ చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. గాజా స్థిరీకరణ దళంలో పాక్ను విశ్వసనీయమైన లేదా ఆమోదయోగ్యమైన భాగస్వామిగా ఇజ్రాయెల్ భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
హమాస్తో పాక్కు లింకులు
హమాస్ కమాండర్ నజీ జహీర్ గత మూడేళ్లుగా అనేక సందర్భాల్లో పాకిస్థాన్లో పర్యటించి, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్తో సమావేశాలు నిర్వహించినట్లు అందిన అజార్ స్పందించారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడి తర్వాత కొద్ది రోజులకే జహీర్ పెషావర్లో ఉన్నారని నివేదికలున్నాయి. ఇజ్రాయెల్ గూఢచార సంస్థలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయని అజార్ ధ్రువీకరించారు. అక్టోబర్ 7 తర్వాత హమాస్ తన అంతర్జాతీయ పరిచయాలను గణనీయంగా విస్తరించిందని, ప్రాంతంలోని వివిధ జిహాదీ సంస్థల మధ్య సమన్వయం పెరుగుతోందని ఆయన అన్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇలాంటి కదలికలు సాధ్యం కాదని అజార్ సూచించారు. ఇజ్రాయెల్, ఇతర భాగస్వాములు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ ఉగ్రవాద సంబంధాలపై గూఢచార సమాచారాన్ని పంచుకుంటున్నారని ఆయన తెలిపారు.
భారత్ భద్రతాపరమైన ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల గతంలో దాడుల నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. భారత అధికారులు ఈ ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నారని, దేశ ప్రయోజనాలను కాపాడతారని తాను విశ్వసిస్తున్నానని అజార్ అన్నారు. హమాస్ను భారత్ అధికారికంగా నిషేధించాలా అనే ప్రశ్నకు ‘స్పష్టమైన ముప్పు ఉంది’ అని, ఈ నిర్ణయం తీసుకోవాల్సింది భారతదేశమేనని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa