ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. వైఎస్సార్సీపీ నేతలు అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతిని హైదరాబాద్ రాజధానితో పోల్చలేమని మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. దీనిలో ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉంటాయని తెలిపారు. వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ, హైదరాబాద్ సచివాలయంతో పోల్చడం సరికాదని అన్నారు. అమరావతి ప్రపంచంలోని 5 టాప్ రాజధానుల్లో ఒకటి కానుంది. అలాంటి దాన్ని హైదరాబాద్ సచివాలయంతో పోల్చలేమని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ, "సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో కట్టే సచివాలయాన్ని హైదరాబాద్ సచివాలయంతో పోల్చుతున్నారు. హైదరాబాద్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, సిబ్బంది కోసమే నిర్మించారు. హెచ్ఓడీలు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. కానీ అమరావతిలో నిర్మించే సచివాలయం అలా కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులతో పాటు విభాగాధిపతి కార్యాలయాలు, కార్పొరేషన్లు ఉంటాయి. అన్నీ ఒకేచోటకు తీసుకొస్తే ప్రజలకు పరిపాలన తేలికగా ఉంటుందని ఇలా నిర్మిస్తున్నాం. అమరావతి గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. సగం తెలుసుకుని మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామని, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్తు, టెలిఫోన్ కేబుళ్లు వంటివన్నీ భూగర్భంలోనే ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి ఒక్కటే రాజధాని అని స్పష్టత ఉందని, అయితే వైఎస్సార్సీపీ రాజధాని ఎక్కడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్.. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అంగీకరించారని, నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని ఆయనే చెప్పారని మంత్రి నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించారని, రాజధాని రైతులకు ఇబ్బందులు కలిగించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు అమరావతి రైతులు, మహిళలు సంతోషంగా ఉన్నారని, అమరావతిని ఆపడం సాధ్యం కాదని తెలిసి వైఎస్సార్సీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa