ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ యుద్ధ కళల్లో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. జపాన్కు చెందిన ప్రతిష్ఠాత్మక 'టకెడా షింగెన్ క్లాన్'లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మార్షల్ ఆర్ట్స్లో ఆయనకున్న అసాధారణ నైపుణ్యానికి గుర్తింపుగా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది.ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు'లో పవన్ నైపుణ్యానికి జపాన్కు చెందిన 'సోగో బుడో కన్రి కై' సంస్థ 5th డాన్ పురస్కారాన్ని అందించింది. అంతేకాకుండా, జపాన్ వెలుపల 'సోకే మురమత్సు సెన్సై'కి చెందిన 'టకెడా షింగెన్ క్లాన్'లో ఆయనకు ప్రవేశం లభించింది. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో 'కెండో'లో కూడా ఆయన ఉన్నత స్థాయి శిక్షణ పొందారు.చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకున్న పవన్, మూడు దశాబ్దాలుగా క్రమశిక్షణతో సాధన చేస్తున్నారు. చెన్నైలో కఠిన శిక్షణ తీసుకోవడమే కాకుండా, జపనీస్ సమురాయ్ యుద్ధ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు. తన సినిమాలలో యుద్ధ కళలను ప్రదర్శించి, వాటికి తెలుగునాట విస్తృత ప్రజాదరణ కల్పించారు.ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సినిమాల్లోనూ కొనసాగుతున్నారు. ఆయన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలకు సిద్ధమవుతుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ అంతర్జాతీయ పురస్కారం యుద్ధ కళల పట్ల పవన్కు ఉన్న అంకితభావానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa