చాలామంది ఇళ్లల్లో పెద్ద వారు వర్షా కాలంలో ఎలక్ట్రిక్ గీజర్లు లేదా హీటర్లు వాడటం కంటే.. గ్యాస్ స్టవ్ మీద, కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచుకుని స్నానం చేయడం మంచిదని సలహా ఇస్తుంటారు. గీజర్లో వేడి చేసిన నీళ్లు ఆరోగ్యానికి హానికరం అని, చర్మ సమస్యలు వస్తాయని వారి భయం. అయితే ఈ విషయంలో వైద్య నిపుణులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శృతి మువ్వ ఈ అంశంపై స్పందిస్తూ.. నీటిని వేడి చేసే సాధనం ఏదైనా సరే.. అంతిమంగా నీళ్లు కేవలం వేడవుతాయి తప్ప వాటి గుణంలో పెద్దగా మార్పు ఉండదని స్పష్టం చేశారు.
హీటింగ్ పరికరం ఏదైనా సమస్య లేదు
చాలామంది గీజర్ నీళ్ల వల్ల చర్మం ముడతలు పడుతుందని లేదా జుట్టు రాలుతుందని ఆందోళన చెందుతారు. దీనిపై డాక్టర్ శృతి మువ్వ మాట్లాడుతూ.. మనం గ్యాస్ స్టవ్ మీద నీటిని వేడి చేసినా లేదా ఎలక్ట్రిక్ హీటర్ వాడినా ఫలితం ఒక్కటేనని వివరించారు.
నీరు వేడెక్కే ప్రక్రియలో వాడే ఇంధనం లేదా విద్యుత్తు కేవలం ఉష్ణోగ్రతను పెంచుతాయని.. అది ఆరోగ్యానికి హాని చేస్తుందనే వాదనలో శాస్త్రీయత లేదని ఆమె పేర్కొన్నారు. నీటిని ఎలా వేడి చేశామనే దానికంటే.. ఎంత వేడిగా ఉన్న నీటిని వాడుతున్నామనేది ఇక్కడ ముఖ్యం అని వెల్లడించారు.
స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మనం వేడి నీళ్ల స్నానాన్ని అమితంగా ఇష్టపడతాం. కానీ అదే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. నీటిని విపరీతంగా మరిగించడం వల్ల అందులోని సహజ ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. అలాగే మరీ వేడిగా ఉన్న నీటిని నేరుగా శరీరంపై పోసుకోవడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు నశించిపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారిపోవడం, దురద వంటి ఇబ్బందులు కలుగుతాయి. అందుకే నీటిని ఎక్కువ సేపు మరగపెట్టకుండా గోరు వెచ్చగా ఉన్నప్పుడే వాడుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు.
సమయం కూడా ముఖ్యమే..
వేడి నీళ్లు అందుబాటులో ఉన్నాయి కదా అని గంటలు గంటలు స్నానాల గదిలో గడపడం ఏమాత్రం మంచిది కాదని డాక్టర్ శృతి మువ్వు వెల్లడించారు. ఎక్కువ సేపు వేడి నీటి స్నానం చేయడం వల్ల రక్తపోటులో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్న పిల్లలు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పది నుండి పదిహేను నిమిషాల లోపు స్నానాన్ని ముగించడం ఉత్తమం అని సూచించారు.
గ్యాస్ గీజర్లతో ప్రమాదం పొంచి ఉందా?
ఎలక్ట్రిక్ గీజర్ల కంటే గ్యాస్ గీజర్లు వాడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బాత్రూమ్లో సరిగ్గా గాలి ఆడని పక్షంలో కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు పేరుకుపోయే ప్రమాదం ఉంది. డాక్టర్ శృతి మువ్వు చెప్పినట్లుగా.. గీజర్ లేదా హీటర్ ఏదైనా సరే.. అది నాణ్యమైన కంపెనీకి చెందినదై ఉండాలి. వైరింగ్ సరిగ్గా లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ ముప్పు ఉంటుంది. కాబట్టి స్నానానికి వెళ్లే ముందే స్విచ్ ఆఫ్ చేయడం లేదా పక్కాగా అర్థ్ సౌకర్యం ఉన్న పరికరాలను ఎంచుకోవడం మంచిది.
ముఖ్యంగా నీటిని వేడి చేసే పద్ధతి కంటే మనం పాటించే జాగ్రత్తలే మన ఆరోగ్యాన్ని కాపాడతాయని గైనకాలజిస్ట్ శృతి మువ్వ స్పష్టం చేశారు. గోరువెచ్చని నీటితో తక్కువ సమయంలో స్నానాన్ని ముగించడం వల్ల శరీరం ఉత్తేజితం అవ్వడమే కాకుండా చర్మం కూడా కాంతివంతంగా ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ దీన్ని అలవాటు చేసుకోవాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa