మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఇరాన్లో చిక్కుకున్న పౌరులను తక్షణమే దేశం విడిచి రావాలని భారత్ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ అంతటా చెలరేగుతున్న నిరసనలు.. అమెరికా దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాల నేపథ్యంలో బుధవారం భారత రాయబార కార్యాలయం లీవ్ ఇరాన్ అంటూ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, యాత్రికులు అందుబాటులో ఉన్న విమాన సర్వీసులు లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది.
తదుపరి నోటీసు ఇచ్చే వరకు భారతీయులు ఎవరూ ఇరాన్కు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టెహ్రాన్లోని భారత ఎంబసీ అత్యవసర సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ పాలకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నిరసనకారులపై హింసను ఆపకపోతే అమెరికా సైన్యం రంగంలోకి దిగుతుందని.. సహాయం త్వరలోనే అందుతుంది అని ట్రంప్ పేర్కొన్నారు.
ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరం నుంచి బీ-52 బాంబర్లు, కేసీ-135 ట్యాంకర్లు సిద్ధమవుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో గత మూడు వారాలుగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటివరకు సుమారు 2,500 మందికి పైగా మరణించినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇరాన్లో ప్రస్తుతం 180కి పైగా నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. నిరసనకారులకు మరణశిక్షలు అమలు చేస్తామని ఇరాన్ న్యాయశాఖ ఇప్పటికే ప్రకటించడంతో.. ప్రస్తుత పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.
ఇరాన్లో ఆందోళనకారులను అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా సాగుతున్న ఈ నిరసనల్లో వేల సంఖ్యలో చనిపోవడం ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇప్పటిదాకా 2,571 మంది చనిపోయినట్లు అమెరికా కేంద్రంగా పని చేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ బుధవారం తెలిపింది. ఇందులో 2,403 మంది నిరసనకారులు, 147 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ ఉద్రిక్తతలతో సంబంధం లేని 12 మంది చిన్న పిల్లలు.. మరో 9 మంది ప్రజలు మృతి చెందినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు 18 వేల మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఈ ఆందోళనలతో ఇరాన్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు. అయితే కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్లింక్ ఫ్రీగా సేవలు అందిస్తున్నట్లు మానవ హక్కుల సంఘాలు చెప్పగా.. స్టార్లింక్ మాత్రం ఇంకా ధృవీకరించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa