ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్ఫోసిస్ కీలక ప్రకటన.. ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు

business |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 11:39 PM

గత కొంతకాలంగా మందగమనంలో ఉన్న భారత ఐటీ రంగం మళ్లీ జవసత్వాలను పుంజుకుంటోంది. దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించిన డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు ఐటీ నిపుణులలో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ముఖ్యంగా నియామకాల విషయంలో ఇన్ఫోసిస్ సానుకూల ధోరణి కనబరచడం ఐటీ ఉద్యోగులకు, ఫ్రెషర్లకు పెద్ద ఊరటనిచ్చే అంశం. క్యూ3లో ఇన్ఫోసిస్ సంస్థలో 5000 మంది ఉద్యోగుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


నియామకాల్లో దూకుడు


ఐటీ రంగంలో ఉద్యోగాల కోత లేదా నియామకాల నిలిపివేత వార్తల మధ్య ఇన్ఫోసిస్ ఒక సానుకూల ప్రకటన చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికరంగా 5,000 మంది ఉద్యోగులను తన సిబ్బందికి అదనంగా చేర్చుకుంది. ఈ నియామకాలతో ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య మునుపటి త్రైమాసికం కంటే పెరిగింది. మరోవైపు ఉద్యోగులు సంస్థను వీడి వెళ్లే రేటు కూడా స్థిరంగా ఉండటం కంపెనీ పనితీరుపై నమ్మకాన్ని పెంచుతోంది. డిసెంబర్ త్రైమాసికం తర్వాత ఇన్ఫోసిస్‌లో మొత్తం 3,37,034 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇది సెప్టెంబర్ త్రైమాసికానికి చూసుకుంటే 3,31,991గా ఉంది. వరుసగా ఆరో త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య పెరగడం గమనార్హం. ముందు ముందు మరింత మందిని నియమించుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


కంపెనీ ఆర్థికంగా కూడా బలోపేతమైనట్లు ఫలితాలు వెల్లడిస్తోంది. ఇన్ఫోసిస్ నికర లాభం ఈ త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను అందుకుంటూ స్థిరమైన వృద్ధిని కనబరిచింది. క్యూ3లో కంపెనీ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 2 శాతం తగ్గి రూ.6,654 కోట్లుగా చూపించింది. ఇక ఆపరేషన్స్ రెవెన్యూ 9 శాతం మేర పెరిగి రూ.45,479 కోట్లుగా నమోదు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూ 3-3.5 శాతం మేర పెరగవచ్చని అంచనా వేసింది. డిజిటల్, క్లౌడ్ సేవల రంగంలో వచ్చిన కొత్త డీల్స్ కారణంగా కంపెనీ ఆదాయం పెరిగింది.


ఈ త్రైమాసికంలో కంపెనీ కీలకమైన అంతర్జాతీయ ఒప్పందాలను కుదుర్చుకుంది, ఇది రాబోయే త్రైమాసికాల్లో కూడా నిలకడైన వృద్ధికి హామీ ఇస్తోంది. జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలపై ఇన్ఫోసిస్ చేస్తున్న పెట్టుబడులు ఆ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి మరిన్ని అవకాశాలను కల్పిస్తాయి. గత కొన్ని త్రైమాసికాలుగా నిలిచిపోయిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు మళ్లీ ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 5,000 మందిని చేర్చుకోవడం అనేది ఐటీ మార్కెట్లోకి కొత్త రక్తం అవసరమని సూచిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa