భారతీయ రైల్వేలో 30 నుంచి 40 ఏళ్ల పాటు చెమటోడ్చి, పదవీ విరమణ పొందిన వేలాది మంది ఉద్యోగుల ఆత్మగౌరవం ఇప్పుడు 'నకిలీ' నాణేల సాక్షిగా గాయపడింది. రిటైర్మెంట్ రోజున సంస్థ ఇచ్చే అత్యున్నత గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ (బంగారు పూత పూసిన వెండి) పతకాలు అసలు వెండివే కావని.. అవి కేవలం రాగి బిళ్లలని తేలడంతో రైల్వే వర్గాల్లో పెను సంచలనం రేగుతోంది.
వెండి అని నమ్మించి.. రాగితో ముంచేశారు!
పశ్చిమ మధ్య రైల్వే పరిధిలో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఓ రైల్వే అధికారి తనకు వచ్చిన వెండి పతకాన్ని అమ్మడానికి తీసుకెళ్లగా.. అక్కడే పరీక్షించిన జ్యువెల్లరీ షాపు యజమానులు అది రాగిదని తేల్చి చెప్పారు. దీంతో అతడు పైఅధికారులు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా 2023 జనవరిలో ఇండోర్కు చెందిన 'మెస్సర్స్ వయబుల్ డైమండ్స్' అనే సంస్థకు 3,640 వెండి నాణేల సరఫరా కోసం రైల్వేశాఖ ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో నాణెం ధర సుమారు రూ. 2,000 నుంచి రూ. 2,200 వరకు నిర్ణయించి.. దాదాపు 3,631 నాణేలను సేకరించారు. అయితే వీటి నాణ్యతపై అనుమానం రావడంతో రైల్వే విజిలెన్స్ విభాగం ల్యాబ్ పరీక్షలు నిర్వహించింది. ఆ నివేదికల్లో తేలిన నిజం చూసి అధికారులు సైతం విస్తుపోయారు.
అయితే బంగారు నాణేల్లో బంగారు పూత పోను 99 శాతం వెండి ఉండాలి. కానీ వీటిల్లో కేవలం 0.23 శాతం మాత్రమే వెండి ఉంది. మిగతా నాణెం మొత్తం రాగితో తయారు చేసి, పైన వెండి, బంగారు పూత పూశారు. ఇలా ఒక్కో నాణెంపై రైల్వే శాఖను దాదాపు రూ. 2,200 మేర ముంచేసిందీ సంస్థ. కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంది.
"గౌరవం కూడా నకిలీదేనా?"
36 ఏళ్ల పాటు సర్వీస్ చేసి గతేడాది రిటైర్ అయిన హస్రత్ జహాన్ ఆవేదన చెందుతూ.. "మేము వీటిని 99 శాతం వెండి అని ఎంతో గర్వంగా ఇంట్లో దాచుకున్నాం. ఇప్పుడు రైల్వే శాఖే ఇది రాగి అని ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. మా సేవకు దక్కిన గౌరవం ఇదేనా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మాజీ చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ టి.కె. గౌతమ్ మాట్లాడుతూ.. గతంలో ఈ నాణేలను ప్రభుత్వ టంకశాలల్లో తయారు చేసేవారని, ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ఈ అక్రమాలపై పశ్చిమ మధ్య రైల్వే సిపిఆర్ఓ హర్షిత్ శ్రీవాస్తవ స్పందిస్తూ.. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. సదరు సరఫరాదారుని బ్లాక్లిస్ట్లో పెట్టడమే కాకుండా భోపాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు. మిగిలిన నాణేలను కూడా స్వాధీనం చేసుకుని లోతైన విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa