గుంటూరు జిల్లా మధురానగర్లో జరిగిన వివాహిత హత్య కేసులో.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంక్రాంతి పండుగ రోజు కేదారేశ్వరపేటలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. కేదారేశ్వరపేటలో ఉండే 39 ఏళ్ల మహిళకు.. 22 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. అంటే ఆమెకు 17 ఏళ్ల వయసులో పెళ్లైంది. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే భర్తతో విబేధాలు వచ్చాయి. దీంతో కొన్ని సంవత్సరాలలోనే విడాకులు తీసుకున్నారు. ఆమెకు అప్పటికే ఒక కొడుకు, కూతురు ఉన్నారు. భర్తతో విడిపోయిన తర్వాత ఆ మహిళకు గుంటూరు జిల్లా నులకపేటకు చెందిన శివకుమార్ అనే ఆటోడ్రైవర్ పరిచయమయ్యాడు.
అప్పటి నుంచి ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కేదారేశ్వరపేటలో నివశిస్తున్నారు. అయితే మహిళ కుమార్తెకు రెండేళ్ల కిందటే పెళ్లి జరిగింది. అయితే ఆమె కూడా భర్తతో విడిపోయింది. విడాకులు తీసుకుని తల్లితో కలిసి ఉంటోంది. భర్తతో విడిపోయిన కూతురికి మరో వివాహం చేయాలని ఆ మహిళ భావించింది. అయితే శివకుమార్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయం మీద ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తెల్లవారుజామున మహిళ ముఖంపై దిండుతో అదిమి హత్య చేశాడు శివకుమార్. ఈ సమయలో మహిళ కేకలు వేయగా.. ఆమె కుమార్తె అక్కడకు వచ్చింది. జరుగుతున్న సంగతి చూసి భయంతో బయటకు పరుగులు తీయగా.. శివకుమార్ రోకలిబండతో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తలకు గాయమైంది. వీరి కేకలు గమనించి స్థానికులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. మహిళ కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa