రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు పట్టుకున్న డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలతో కయ్యాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. భారత్పై టారిఫ్స్ అంటూ బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ బృందంలోని సభ్యులు కూడా భారత్పై చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ముందున్నారు. ఇప్పటికే భారత్పై ఈయన పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రష్యా నుంచి చమురు కొంటున్న భారత్.. దానిని తిరిగి ఎక్కువ ధరకు అమ్ముకుని లాభాలు గడిస్తోందిని, భారత్ చాకిరేవు దుకాణం నడుపుతోందని నోరు పారేసుకున్నారు పీటర్ నవారో. ఆ తర్వాత మరో మెట్టు ఎక్కి కులాల ప్రస్తావన తీసుకువచ్చారు. భారతీయుల పేరుతో ఆయిల్ కొంటూ.. సంపన్నవర్గాలు లాభాలు గడిస్తున్నాయంటూ ఆరోపించారు. తాజాగా మళ్లీ భారత్పై విషం కక్కారు పీటర్ నవారో. భారత్ వంటి దేశాల్లో అమెరికా ఏఐ కంపెనీలు సేవలు అందించడాన్ని ఆయన తప్పుపట్టారు.
చాట్జీపీటీ వంటి కృత్రిమ మేధ (ఏఐ) ప్లాట్ఫామ్లు అమెరికా భూభాగంపై వనరులను ఉపయోగిస్తున్నాయని పీటర్ నవారో అన్నారు. ఆయా సంస్థలు అమెరికాలోని విద్యుత్ను ఉపయోగించి పనిచేస్తున్నాయని చెప్పారు. కానీ, భారత్ వంటి దేశాల్లో పెద్ద సంఖ్యలో యూజర్లకు సేవలు అందిస్తున్నాయని అన్నారు. భారత్లో ఏఐ సేవల కోసం అమెరికన్లు ఎందుకు డబ్బులు చెల్లిస్తున్నారు? అని నవారో ప్రశ్నించారు. అంతేకాకుండా ఇతర దేశాలకు చెందిన సంస్థలు అమెరికాలో వ్యవసాయ భూములను.. వాస్తవ ధర కంటే పది రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయన్నారు. ఇది అమెరికాలో ధరల పెరుగుదలకు కారణమవుతుందని అన్నారు.
కాగా, ఇటీవల భారత్పై పీటర్ నవారో చేసినవి తప్పుడు వ్యాఖ్యలని ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఆయన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసి బుద్ధి చెప్పినట్లు అయింది. రష్యా నుంచి కేవలం ఇంధన భద్రత కోసమే.. భారత్ చమురు కొనుగోలు చేస్తోందని క్లారిటీ ఇచ్చింది. "భారత అధిక టారిఫ్లో విధించడంతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. లాభం కోసం రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్తో రష్యా కొనసాగిస్తోన్న యుద్ధానికి భారత్ నిధులు సమకూర్చుతోంది. ఇరుదేశాల ప్రజలు యుద్ధంలో చనిపోతున్నారు. అమెరికా ట్యాక్స్ పేయర్లు ఎక్కువ ఖర్చుచేయాల్సి వస్తోంది. భారత్ మాత్రం వాస్తవాన్ని గ్రహించడం లేదు" అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దీనిపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసింది. దీన్ని ఒప్పుకోని నవారో.. ఫ్యాక్ట్ చెక్ను కూడా తప్పుపట్టి తన విష ప్రచారాన్ని సమర్థించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa