సమాజంలో రోజురోజుకూ అనేక నేరాలు, మరెన్నో ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. సాటి మనిషిని నమ్మే పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఆశ, అత్యాశ, స్వార్థం, మోహం, కామం.. ఇలాంటి కారణాలతో జరుగుతున్న దారుణాలెన్నో. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం రోజున గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్కు ఇద్దరు మహిళల ఫిర్యాదుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముసుగులో తిరిగే ఓ వ్యక్తి అసలు బాగోతం, అతను సాగించిన యవ్వారం వెలుగులోకి వచ్చింది.
బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన శ్రీకాంత్ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇతనికి రేపల్లెకు చెందిన ఓ యువతితో పరిచయమైంది. అప్పటికి ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో ఉంటోంది. పైగా అతనికి దూరపు బంధువు. పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యాల సమయంలో కలిసేటప్పుడు.. పరిచయమైంది. అలా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిశాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెళ్లికి అమ్మాయి కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో శ్రీకాంత్ ఆ యువతిని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి 2019లో జరిగింది. పెళ్లి జరిగిపోయిన తర్వాత.. ఇక చేసేదేమీ లేక యువతి కుటుంబసభ్యులు వారి పెళ్లిని అంగీకరించారు.
శ్రీకాంత్కు కట్నంగా 15 సవర్ల బంగారంతో పాటుగా రూ.10లక్షలు ఇచ్చారు. కొన్ని రోజులు వారి కాపురం బాగానే సాగింది. అయితే యువతి గర్భవతి అయిన తర్వాత శ్రీకాంత్ ఆమెను పుట్టింటికి పంపించాడు. ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలేశాడు. బాబు పుట్టిన తర్వాత కూడా కాపురానికి తీసుకెళ్లలేదు. అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. పెద్దలు పంచాయితీ చేసిన ఉపయోగం లేకుండా పోయింది. దీంతో యువతి కుటుంబసభ్యులు శ్రీకాంత్ మీద పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగానే పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా శ్రీకాంత్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన యువతిని 2023లో వివాహం చేసుకున్నాడు. కట్నంగా రూ.5లక్షలు నగదు, ఇతర లాంఛనాలను యువతి కుటుంబసభ్యులు పూర్తి చేశారు. ఆ యువతి గర్భవతై.. ఏడు నెలల కడుపుతో ఉన్న సమయంలో శ్రీకాంత్ ఆమెను పుట్టింట్లో వదిలిపెట్టాడు. వీరికి ఓ బాబు పుట్టిన తర్వాత శ్రీకాంత్కు అప్పటికే పెళ్లైనట్లు ఖమ్మం యువతికి తెలిసింది. విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నావా అంటూ నిలదీసింది. దీంతో అప్పటి నుంచి శ్రీకాంత్ ఆమె ఇంటికి పోవటం మానేశాడు. యువతి కుటుంబసభ్యులు గట్టిగా అడిగితే అసలు తనను వివాహం చేసుకోలేదని, 2013 సంవత్సరం నుంచి సహజీవనం చేస్తున్నానని చెప్తున్నాడంటూ బాధితురాలు వాపోయింది.
ఇలా ఉండగానే మరో యువతి ఫోటోను మార్ఫింగ్ చేసిన శ్రీకాంత్.. ఆమెనే పెళ్లి చేసుకుంటానంటూ వీరిద్దరికీ ఫోటోలు పంపించి బెదిరిస్తున్నాడు. దీంతో రేపల్లె మహిళ, ఖమ్మం మహిళ ఇద్దరూ కలిసి సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ను కలిసి మనోడి మీద ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa