ట్రెండింగ్
Epaper    English    தமிழ்

270 ఏళ్ల తర్వాత కేరళలో తొలిసారి కుంభమేళా.. రథయాత్రను అడ్డుకున్న తమిళనాడు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 10:25 PM

కేరళలో దాదాపు మూడు శతాబ్దాల తర్వాత కుంభమేళా జరుగుతోంది. నీలా నది (భారతపుళ) తీరంలో కేరళ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన‘మహామాఘ మహోత్సవం’ ప్రారంభమైంది. మలప్పురం జిల్లా తిరునవయలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ఈ క్రతువును లాంఛనంగా ప్రారంభించారు. మాహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్‌లో జరిగింది. ఈ ఉత్సవాన్ని 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత పూర్తి‌స్థాయిలో నిర్వహించడం చెప్పుకోదగ్గ అంశం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 1755లో ఈ కుంభమేళా జరిగినట్లు సమాచారం.


ఫిబ్రవరి 3 వరకు కొనసాగే ఈ కుంభమేళా ఉత్సవానికి కేరళ, తమిళనాడు , కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రోజుకు దాదాపు 50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. వేడుకల్లో భాగంగా కాశీ పండితుల ఆధ్వర్యంలో రోజూ సాయంత్రం నీలానది హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు కేరళ ఆర్టీసీ.. 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కేరళ సంప్రదాయ విద్య కలరిపయట్టు, యోగతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


అయితే, ఈ కుంభమేళాలో భాగమైన రథయాత్ర కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది తమిళనాడులోని ఉడుమల్‌పేట సమీపంలోని తిరుమూర్తి కొండ నుంచి సోమవారం ఉదయం రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం నిలిపివేసింది. తిరుమూర్తి కొండల్లోని భారతపుళ నది ముఖద్వారం నుంచి రథయాత్రను ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు.


కానీ, ఈ ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నట్టు నిర్వాహకులు ఆరోపించారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల ఆదేశాలతోనే స్థానిక పోలీసులు రథయాత్రను ఆపేశారని తెలిపారు. ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో విగ్రహాన్ని కేరళ సరిహద్దుకు వాహనంలో తరలించి, పాలక్కాడ్ నుంచి రథయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. మహామాఘ మహోత్సవం సందర్భంగా కోజికోడ్‌లో భారతీయ ధర్మ ప్రచార సభ ఆచార్య డాక్టర్ శ్రీనాథ్ కారయత్ ఈ రథయాత్రకు శ్రీకారం చుట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa