గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ ఎన్నడూ చూడని దౌత్యపరమైన, రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. గతేడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పౌరులను ఊచకోత కోసిన ఘటనకు నిరసనగా.. భారత్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 1960 నుంచి అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి బదులుగా ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఇప్పుడు నీటి కోసం ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థల చుట్టూ తిరుగుతోంది.
పాక్ను వ్యూహాత్మక దెబ్బకొట్టిన భారత్
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక సాంకేతికపరమైన ఒప్పందం నిలిపివేత మాత్రమే కాదు.. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా వాడుతున్న పాకిస్తాన్కు భారత్ ఇచ్చిన బలమైన వ్యూహాత్మక సంకేతం. 'సాధారణ సహకారం.. అసాధారణమైన శత్రుత్వంతో కలిసి సాగలేవు' అని భారత్ స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలంటే పాక్ తన భూభాగంపై ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా తుడిచిపెట్టాలని భారత్ షరతు విధించింది.
సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాకిస్తాన్ దేశ వ్యవసాయం 80 శాతం నుంచి 90 శాతం వరకు ఈ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. కేవలం 30 రోజులకు సరిపడా నీటి నిల్వ సామర్థ్యం మాత్రమే ఉండటం.. తర్బెలా డ్యామ్, మంగళ డ్యామ్లలో నీటి స్థాయిలు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకోవడంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీన్ని యుద్ధ చర్యగా అభివర్ణిస్తున్న పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
గత 9 నెలల్లో పాకిస్తాన్ ఈ అంశాన్ని అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, షాంఘై సహకార సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి వేదికలపై భారత్పై పాకిస్తాన్ ఫిర్యాదులు చేస్తోంది. నీటిని ఆయుధంగా మలచడం అనే నినాదంతో దౌత్య యుద్ధం చేస్తోంది. అయితే.. తన దేశంలో ఉగ్రవాద సంస్థలు బహిరంగంగా కార్యకలాపాలు సాగిస్తున్న విషయాన్ని మాత్రం దాచిపెట్టి.. కేవలం సింధు నదీ జలాల ఒప్పంద ఉల్లంఘన జరిగిందంటూ విదేశీ ప్రతినిధులను ఆశ్రయిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa