గతవారం గోవాలో జరిగిన రష్యా మహిళల జంట హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఇద్దర్నీ అలెక్సీ లియోనొవ్ అనే రష్యన్ జాతీయుడు హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. డబ్బులు, రబ్బరు బ్యాండు కోసమే ఇద్దర్నీ హత్యచేసినట్టు తాజాగా పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. మోర్జిం గ్రామంలో తొలుత తన స్నేహితురాలు ఎలీనా వనీవా (37) ను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం అక్కడ నుంచి మరో 8 కి.మీ. దూరంలో ఉన్న అరాంబోల్కు వెళ్లి మరో స్నేహితురాలు ఎలీనా కాస్థనోవా గొంతుకు తాడు బిగించి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు.
ఫైర్ డ్యాన్సర్ అయిన ఎలీనా కాస్థనోవా.. ఫైర్ వర్క్ ఆర్టిస్ట్ అయిన నిందితుడు లియోనొవ్ నుంచి రబ్బరు రింగుతో పాటు కొంత డబ్బును అప్పుగా తీసుకుంది. వనీనా కూడా అతడి వద్ద అప్పుతీసుకుందని, ఇరువురూ తిరిగి వాటిని చెల్లించలేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఇరువురితో గొడవపడిన నిందితుడు.. రెండు రోజుల్లోనే ఇద్దర్నీ హత్యచేశాడని పోలీస్ వర్గాలు తెలిపారు. ఈ హత్యలు ముందుగా ప్లాన్ చేసినవి కాదని, అనుకోకుండా జరిగిపోయాయని పేర్కొన్నాయి. ఆ సమయంలో నిందితుడు ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టు భావిస్తున్నారు.
బబుల్ ఆర్టిస్ట్ అయిన ఎలెనా వనీవా జనవరి 10న ఇండియాకు వచ్చిందని, కాస్థనోవా డిసెంబరు 25 నుంచి నిందితుడితో కలిసి గోవాలో ఉందని గుర్తించారు. కాస్థనోవా, అలెక్సీలు ప్రదర్శనల కోసం దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లి, తరుచూ గోవాకు వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక వీసాతో ఇండియాకు వచ్చిన నిందితుడు.. దేశంలోని పలు నగరాల్లో తిరిగినట్టు తెలిసింది. అలెక్సీ చిన్నచిన్న పనులు చేస్తూ రోజంతా ప్రయాణిస్తూ ఉండేవాడని వర్గాలు తెలిపాయి.
సీరియల్ కిల్లర్?
గోవా పోలీసు వర్గాల ప్రకారం.. తనతో గొడవలు ఉన్న మరో ఐదుగురిని కూడా చంపినట్లు అంగీకరించిన నిందితుడు.. వారి పేర్లను చెప్పాడు. అయితే పోలీసులు విచారణ జరపగా అతడు చెప్పిన ఆ ఐదుగురూ ప్రాణాలతోనే ఉన్నట్లు తేలింది. అలెక్సీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఎప్పుడూ డ్రగ్స్ మత్తులోనే ఉండేవాడని వర్గాలు తెలిపాయి. గోవా పోలీసులు నిందితుడి ఫోన్లో 100 మందికి పైగా మహిళలు, ఇద్దరు పురుషుల ఫోటోలను కూడా గుర్తించారు. చిన్న విషయాలనే చిరాకుపడేవాడు, కానీ వారితో త్వరగా స్నేహం కూడా చేసేవాడు. గతంలో గోవాలో దాడి కేసులలో పాల్గొన్నాడు కానీ కానీ అతడిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
అసోం మహిళ హత్యతో సంబంధం?
జనవరి 12న తన ఇంట్లో శవమై కనిపించిన అసోం మహిళ మృదుస్మిత సైకియా హత్యతో అలెక్సీకి ఉన్న సంబంధంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళకు, అలెక్సీకి చాలా కాలంగా పరిచయం ఉంది. వారు చాలాసార్లు కలిసి గోవాకు వచ్చేవారు. సైకియా హత్యకు ఒక రోజు ముందు, జనవరి 11న ఇద్దరూ కలిసే ఉన్నారని వర్గాలు తెలిపాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఆ మహిళ డ్రగ్స్ అధిక మోతాదు కారణంగా మరణించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa