భూముల రీసర్వేపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రీసర్వే కాలాన్ని 90 రోజుల నుంచి 143 రోజులకు పెంచారు. ఈ విషయాన్ని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. భూముల రీసర్వే 2.0 కార్యక్రమాన్ని పూర్తి కచ్చితత్వంతో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రీసర్వేకు సంబంధించిన పలు కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకూ మూడు దశలలో 2,097 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసినట్లు అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. నాలుగో విడతలో 1,613 గ్రామాల్లో భూముల రీసర్వే కొనసాగుతున్నట్లు తెలిపారు. రైతుల భాగస్వామ్యంతో ఈ ప్రక్రియను చేపడుతున్నామనీ.. రీసర్వే కాలాన్ని కూడా 90 రోజుల నుంచి 143 రోజులకు పెంచినట్లు అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో చేపట్టిన భూముల సమగ్ర సర్వేపై అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. సర్వే మొత్తం తప్పుల తడకగా ఉందని.. ప్రజల నుంచి7.5 లక్షల ఫిర్యాదులు వచ్చాయని మంత్రి వివరిచారు. వైసీపీ హయాంలో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ముద్రించారని.. అయితే ఆ క్యూర్ కోడ్ స్కాన్ చేస్తే.. రియల్ టైమ్ డేటా కనపించడం లేదని అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అలాంటి తప్పులు లేకుండా తమ ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నామని.. పాసు పుస్తకాల మీద రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుందని మంత్రి వివరించారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రియల్ టైమ్ సమాచారం రావటమే కాకుండా.. నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
మరోవైపు భూముల రీసర్వే ప్రక్రియలో ప్రభుత్వం రైతులకు కీలక పాత్ర కల్పిస్తోంది. గ్రామాలలో భూముల రీసర్వే ప్రారంభం, ముగింపు విషయంలో రైతుల ప్రమేయం ఉండనుంది. భూముల రీసర్వే ప్రారంభం, ముగింపుతో పాటుగా ఆర్వోఆర్-భూమి హక్కుల నిర్ధారణ, పాస్పుస్తకాల జారీ.. ఇలాంటి కీలకమైన అంశాలలో రైతుల భాగస్వామ్యం ఉంటుంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ అధికారులకు సూచించింది. భూముల రీసర్వేకు నోటీసుల జారీ దగ్గర నుంచి భూమి హక్కుల నిర్ధారణ వరకు రైతుల భాగస్వామ్యం ఉండేలా విధివిధానాలు రూపొందించారు. ఇందులో భాగంగా గ్రామాలలో రైతులు, పట్టాదారులతో సభలు నిర్వహించనున్నారు అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa