ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోసూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం బ్రేకులు,,,చంద్రబాబుపై తమిళ తంబీల ఆరోపణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 09:55 PM

తమిళనాడులోని హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ వ్యవహారం తమిళనాట రాజకీయ దుమారం రేపుతోంది. ఇక హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఆగిపోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు అంటూ తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఓ తమిళ దినపత్రికలోనూ ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఫొటోతో కూడిన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. చంద్రబాబు కుప్పంలో విమానాశ్రయం నిర్మిస్తుండటంతో.. హోసూరుకు ఎయిర్‌పోర్టు రావడం అనుమానంగా మారిందని ఆ కథనంలో పేర్కొన్నారు. కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. వాటిని తిప్పికొడుతూ అసలు నిజాన్ని మరికొందరు నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ఈ హోసూర్, కుప్పం ఎయిర్‌పోర్టు వ్యవహారం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


అసలేం జరిగింది?


తమిళనాడులోని పారిశ్రామిక నగరమైన హోసూర్‌లో 2 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హోసూర్ ఎయిర్‌పోర్టు కు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు పంపించగా.. అక్కడ షాక్ తగిలింది. భద్రతా కారణాల రీత్యా ఈ హోసూర్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుకు అనుమతిని నిరాకరించింది.


ఈ హోసూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని తిరస్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా రెండు కారణాలను వెల్లడించింది. హోసూర్ సమీపంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉంది. అక్కడ నిరంతరం రక్షణ విమానాలు, హెలికాప్టర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమీపంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే.. ముప్పు వాటిల్లుతుందని రక్షణ శాఖ పేర్కొంది. మరోవైపు.. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో 2033 వరకు మరో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించకూడదని ఉన్న నిబంధన కూడా దీనికి ఒక అడ్డంకిగా మారింది.


కుప్పం ఎయిర్‌పోర్టు


అయితే ఈ హోసూరుకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో మాత్రం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పుడు ఇదే తమిళ తంబీల ఆగ్రహానికి కారణం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం (రామకుప్పం మండలం)లో 1250 ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. దీన్ని 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


కేంద్రం, టీడీపీపై డీఎంకే విమర్శలు


అయితే హోసూరు ఎయిర్‌పోర్టుకు అనుమతులు నిరాకరించిన కేంద్రం.. కుప్పం ఎయిర్‌పోర్టుకు సహకరిస్తోందని డీఎంకే, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒత్తిడి కారణంగా.. హోసూర్ ఎయిర్‌పోర్టును వద్దని, కుప్పం ఎయిర్‌పోర్టుకు కేంద్రం మద్దతు ఇస్తోందని తమిళనాడు నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిది కూడా టీడీపీనే కావడంతో.. తమిళ నేతల అనుమానం మరింత బలపడుతోంది.


రాజకీయ విమర్శలు


ఈ వ్యవహారంపై తమిళనాడుకు చెందిన కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. గత 30 ఏళ్లుగా హోసూర్‌లో ప్రైవేట్ రన్‌వే ఉందని.. ప్రధానమంత్రి సహా చాలా మంది ప్రముఖులు వచ్చే పెద్ద విమానాలు కూడా హోసూర్‌లో ల్యాండ్ అవుతున్నాయని.. అప్పుడు లేని భద్రతా సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని గోపీనాథ్ ప్రశ్నించారు.


తమిళనాడుపై ప్రభావం


తమిళనాడులోని కృష్ణగిరి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం కేవలం 36 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు హోసూరు కాకుండా కుప్పంలో ఎయిర్‌పోర్టు నిర్మించి అందుబాటులోకి వస్తే.. హోసూర్ పారిశ్రామికవేత్తలు మాత్రమే కాకుండా అక్కడి ప్రజలు కూడా దాన్నే వినియోగిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. దీనివల్ల తమిళనాడు ప్రతిపాదించిన హోసూరు ఎయిర్‌పోర్టు కల చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయని తమిళనాడు నేతలు ఆరోపిస్తున్నారు.


సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైట్


ఇక ఇదే ఎయిర్‌పోర్టుల వ్యవహారం సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. హోసూరు ఎయిర్‌పోర్టును కేంద్రం తిరస్కరించడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఓ తమిళ పత్రిక రాసిన కథనాన్ని చెన్నై అప్డేట్స్ అనే ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేసి.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కూడా చంద్రబాబు పార్టీకి చెందినవారేనని పేర్కొన్నారు. కుప్పం వద్ద ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నారని కూడా తెలిపారు.


హోసూర్ ఎయిర్‌పోర్టు అవసరమా?


అయితే ఈ వాదనను నెటిజన్లు ఖండిస్తున్నారు. శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్డు (ఎస్‌టీఆర్ఆర్) పూర్తి అయిన తర్వాత.. హోసూర్ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు కేవలం 30 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని.. ఇది 6 నెలల్లో పూర్తి అవుతుందని అంచనా వేసినట్లు మరో నెటిజన్ తెలిపారు. హోసూర్‌కు ప్రత్యేక ఎయిర్‌పోర్టు అవసరం లేదని.. ఇది కేవలం బీజేపీకి వ్యతిరేకంగా రానున్న ఎన్నికల కోసం డీఎంకే చేస్తున్న ప్రచారమని కొట్టిపారేశారు. దానికి కౌంటర్‌గా హోసూర్ ఎయిర్‌పోర్టును.. హోసూర్-కృష్ణగిరి-ధర్మపురి ప్రాంతాలకు సేవలు అందించడానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉద్దేశించి ప్రతిపాదించిందని.. ఆ ఎయిర్‌పోర్టు అక్కడ ఇప్పుడు చాలా అవసరమని పేర్కొన్నారు.


మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. హోసూరు, కృష్ణగిరి ప్రాంతాలకు ఏపీ, కర్ణాటకలకు చేరువగా ఉంటాయి. అంతే కాదు.. ఈ ప్రాంతంలో తెలుగు ప్రజలే ఎక్కువగా ఉంటారు. కృష్ణగిరి ఎంపీ కూడా తెలుగు వ్యక్తే. బెంగళూరు విమానాశ్రయానికి 150 కి.మీ. దూరం వరకు కొత్త ఎయిర్‌పోర్టు నిర్మించొద్దని 2008లో నిబంధన విధించారు. ఒకవేళ ఇప్పుడు హోసూరులో విమానాశ్రయం ఏర్పాటైనా సరే.. ఈ నిబంధన ప్రకారం 2033 వరకు కొత్త విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కుదరదు. అయినా సరే తమిళ నేతలు రాద్దాంతం చేస్తుండటం, చంద్రబాబు నాయుణ్ని ఈ వివాదంలోకి లాగడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa