ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆదివారం (జనవరి 25) కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (పద్మనాభరెడ్డి) టీడీపీ సీనియర్ లీడర్తో భేటీ అయ్యారు. టీడీపీ సీనియర్ లీడర్, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తో ముద్రగడ భేటీ అయ్యారు. పెద్దాపురంలోని నిమ్మకాయల చినరాజప్ప క్యాంపు కార్యాలయంలో.. ముద్రగడ, చినరాజప్ప భేటీ జరిగింది. అయితే ఇది కేవలం సాధారణ సమావేశమేనని తెలిసింది. ముద్రగడ గతేడాది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో కూడా చేరారు. ఆ సమయంలో ముద్రగడను పరామర్శించేందుకు నిమ్మకాయల చినరాజప్ప ఆస్పత్రికి వెళ్లారు. అయితే వైద్యుల సూచనతో కలవలేకపోయారు.
ఈ నేపథ్యంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత నిమ్మకాయల చినరాజప్పను కలవాలని ముద్రగడ భావించారు. అయితే ఇన్నిరోజులూ వీలు కుదరలేదు. తాజాగా ఆదివారం రోజున పెద్దాపురంలోని చినరాజప్ప కార్యాలయానికి వెళ్లిన ముద్రగడ..ఆయనతో భేటీఅయ్యారు. తనను కలిసేందుకు ఆస్పత్రి వరకూ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య కుటుంబ విషయాలు, వ్యక్తిగత, ఆరోగ్య విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు గతేడాది జూలై నెలలో ముద్రగడ అనారోగ్యానికి గురయ్యారు. షుగర్ లెవల్స్ పడిపోవటంతో కాకినాడలో ఓ ఆస్పత్రిలో చేరారు. డయాలసిస్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడింది.
మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ముద్రగడ వైసీపీలో చేరారు. చాలా రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించటానికి తీవ్రంగా కృషిచేశారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం శక్తివంచన లేకుండా పని చేశారు ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ అప్పట్లో ఛాలెంజ్ చేయటం రాజకీయంగా సంచలనం రేపింది. అయితే మొన్నటి ఎన్నికలలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించటంతో.. ఆ తర్వాత ఆయన తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. అప్పటి నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డి వైసీపీలో కొనసాగుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa