ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని ప్రఖ్యాత నాందేడ్ తఖ్త్ సచ్ ఖండ్ గురుద్వారాను సందర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి ఆయన ఈ పర్యటనలో పాల్గొన్నారు. సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ సమాధి మందిరంలో ఇరువురు నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పవిత్ర చాదర్ను సమర్పించారు.గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ వచ్చిన పవన్ కల్యాణ్, మధ్యాహ్నం సచ్ ఖండ్ గురుద్వారాకు చేరుకున్నారు. గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గురుద్వారా ప్రముఖులు పవన్ కల్యాణ్కు సంప్రదాయ సిక్కు తలపాగాను అలంకరించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి ఫడ్నవిస్తో కలిసి ప్రధాన మందిరంలోకి ప్రవేశించారు. గురు గోవింద్ సింగ్ సమాధి వద్ద ప్రార్థనలు చేసి, చాదర్ సమర్పించారు. గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రంతో పవన్ కల్యాణ్, ఫడ్నవిస్లను ఆశీర్వదించారు. దర్శనం అనంతరం గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్ను వారు ప్రారంభించారు.అంతకుముందు, తొలిసారి గురుద్వారాకు విచ్చేసిన పవన్ కల్యాణ్ను సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికతో పాటు, సిక్కులు పవిత్రంగా భావించే కిర్పాన్ను బహుకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూగురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిప్రదాత. ఆయన చేసిన త్యాగం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి మహనీయుడి షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అని తెలిపారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటైన ఈ గురుద్వారా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa